కేంద్రం మెట్టు దిగిందా?: విద్యార్థులతో చర్చలకు సిద్ధం: అర్బన్ మావోయిస్టులతో కాదు: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ చెలరేగుతున్న ఆందోళనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. దేశ రాజధాని సహా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోనూ హింసాత్మక పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం, నిరసన జ్వాలలు ప్రజ్వరిల్లడాన్ని కేంద్రం తీవ్రంగా తీసుకుంది. విద్యార్థి సంఘాల నాయకులతో చర్చిండానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
నిరసనలను నియంత్రించడానికి ప్రయత్నించినా..
పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు ప్రస్తుతం.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఈ ఉద్యమానికి విద్యార్థులు సారథ్యాన్ని వహిస్తుండటంతో పరిస్థితి మరింత క్లిష్టతరమైనట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి అత్యుత్తమ విద్యాసంస్థల విద్యార్థులు నిరసన ప్రదర్శనలకు దిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో- జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో వారి నిరసనలు మిన్నంటిపోయాయి.
విద్యార్థుల్లో అనుమానాలను తొలగించడానికి..
పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెరమీదికి వచ్చిన ఆందోళనలకు విద్యార్థులు నాయకత్వాన్ని వహిస్తుండటంతో బలవంతంగా అణచి వేయలేకపోతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను భయాందోళనలకు గురి చేయడం కంటే.. వారితో సానుకూల వాతావరణంలో చర్చల ప్రక్రియను చేపట్టడమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది.
విద్యార్థి సంఘాలతో చర్చలకు సిద్ధం..
పౌరసత్వ సవరణ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల్లో నెలకొన్న అయోమయాన్ని, గందరగోళాన్ని, అనుమానాలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం ఆందోళనలకు నేతృత్వాన్ని వహిస్తోన్న అన్ని యూనివర్శిటీలు, జాతీయ స్థాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులను త్వరలోనే ఢిల్లీకి పిలిపించి, మాట్లాడతామని ఆయన తెలిపారు.
టుకడె, టుకడె గ్యాంగ్స్
విద్యార్థి సంఘాలతో మాత్రమే తాము చర్చించాలని ఓ నిర్ణయానిక వచ్చినట్లు రవిశంకర్ ప్రసాద్ చెబుతున్నారు. అంతే తప్ప చిన్న, చిన్న గ్యాంగ్ లను వెంటేసుకుని తిరిగే వారిని చర్చలకు ఆహ్వానించబోమని తేల్చి చెప్పారు. అర్బన్ మావోయిస్టులు, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీల నాయకులతో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోయేది లేదని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమాల వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందని ఆరోపించారు. కొందరు ఆందోళనకారులు అర్బన్ మావోయిస్టుల్లాగా తయారయ్యారని విమర్శించారు.