సీఏఏపై ఆగని నిరసనలు.. యూపీలో శుక్రవారం ప్రశాంతం.. ఢిల్లీలో పీఎం ఇంటివైపు నిరసన ర్యాలీ..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పలు నగరాల్లో.. ప్రార్థనల అనంతరం ముస్లిం యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి జాతీయ జెండాలతో ర్యాలీలు చేపట్టారు. సీఏఏ నిరసనల్లో ఎక్కువ హింస చోటుచేసుకున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ఎలాంటి ఉద్రిక్తత తలెత్తలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో బలగాల మోహరింపుతోపాటు 'హ్యాక్ ఐ' నిఘా ఏర్పాటుచేయడం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచినట్లు ఆయన తెలిపారు
ప్రధాని ఇంటి ముట్టడికి యత్నం..
గత శుక్రవారం ఢిల్లీ జమా మసీదులో సీఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొని అరెస్టయిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను విడుదల చేయాలనే డిమాండ్ తో దళిత యువత సంఘాలు ఇవాళ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికారిక నివాసానికి ర్యాలీగా బయలుదేరిన భీమ్ ఆర్మీని పోలీసులు అడ్డుకున్నారు. ఈశాన్య ఢిల్లీతోపాటు పలు చోట్ల నిరసనకారులు ప్రదర్శనలు చేశారు.
నేను బతికుండగా అది జరగదు: మమత
తాను బతికున్నంత కాలం వెస్ట్ బెంగాల్ లో సీఏఏను అమలు కానివ్వబోనని ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ అన్నారు. శుక్రవారం కోల్ కతాలో జరిగిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కుందని, దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు టీఎంసీ పూర్తి మద్దతు ఇస్తున్నదని మమత చెప్పారు.
అమిత్ షాపై ప్రియాంక సెటైర్లు.. యువతకు భరోసా
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాల విషయంలో బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్లను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘‘వరుసక్రమాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి.. ముందుగా వాళ్లు.. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ వెంటనే యూనివర్సిటీల్ని ధ్వంసం చేస్తారు.. తర్వాత దేశ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తారు.. దీనికి వ్యతిరేకంగా యువత ఉద్యమిస్తుంది.. యువతని ఫూల్స్ గా చిత్రీకరించేందుకు వాళ్లు ప్రయత్నిస్తారు.. అయినాసరే యంగిస్తాన్ ఏమాత్రం బెదరకుండా నిలబడుతుంది‘‘అని ప్రియాంక ట్వీట్ చేశారు.
అనుకూలంగా ఇంకొందరు..
పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ మహారాష్ట్ర, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు జరిగాయి. ముంబైలో జరిగిన ర్యాలీలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తోపాటు పలువురు బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు.