జమా మసీదు పాకిస్తాన్లో ఉందా?: జడ్జి కామిని ఉగ్రరూపం.. పోలీసులపై ఫైర్
ఏ విషయంలోనైనా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉంటుందని, ఎక్కువకాలం 144 సెక్షన్ విధింపు కూడా హక్కులకు విఘాతం కల్పించడమేనని ఇటీవలే సుప్రీంకోర్టు పేర్కొంది. అదే తరహాలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలపై ఢిల్లీ తీస్ హజారీ సెషన్స్ కోర్టు జడ్జి కామిని లావు మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఏఏ వ్యతిరేక నిసనల్లో దాదాపు 40 మంది చనిపోగా, వేలమందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్(రావణ్) బెయిల్ పిటీషన్ పై విచారణ సందర్భంగా తీస్ హజారీ కోర్టులో ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి.
ఏం జరిగిందంటే..
సీఏఏ నిరసనల్లో భాగంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గతేడాది డిసెంబర్ 21న ఢిల్లీలోని జమా మసీదు ప్రాంగణంలో వేలాది ముస్లింలతో కలిసి మౌనప్రదర్శన చేశారు. ఈ సంఘటనతో ఆందోళనలకు మరింత ఊపందుకున్నాయి. మసీదులో నిరసనలు తెలిపిన కారణంగా ఆజాద్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మూడు వారాలుగా కస్టడీలో ఉన్నఆయన బెయిల్ కోసం తీస్ హజారీ కోర్టులో పిటిషన్ వేశారు. హింసకు పాల్పడినట్లు ఆధారాలు లేకున్నా అరెస్టు చేయడం అన్యాయమని ఆయన వాదించారు.
పాకిస్తాన్లో ఉన్నా సరైందే..
ఆజాద్ ను ఎందుకు అరెస్టు చేశారనే దానిపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఢిల్లీ పోలీసులపై జడ్జి కామిని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘జమా మసీదు పాకిస్తాన్ లో ఉందా? ఒకవేళ పాకిస్తాన్ లో ఉన్నా మసీదులో శాంతియుత నిరసనలు తెలపడం తప్పుకాదు. ఒక్క మసీదనేకాదు.. హింసకు దారితీయనంతవరకు ఏ ప్రార్థనా స్థలంలోనైనా శాంతియుతంగా నిరసన చేసే హక్కు పౌరులకు ఉంటుంది''అని జడ్జి పేర్కొన్నారు.
విచారణ రేపటికి వాయిదా
జడ్జి ప్రశ్నలకు కంగుతిన్న ఢిల్లీ పోలీసులు.. సోషల్ మీడియాలో ఆజాద్ పెట్టిన పోస్టుల్ని ప్రస్తావించారు. మసీదులో నిరసన చేయడానికి వెళుతున్నానని ఆజాద్ చెప్పడం రెచ్చగొట్టే చర్యే అని పోలీసులు వాదించారు. దీంతో మళ్లీ మండిపడ్డ కోర్టు.. కనీస అవగాన లేకుండా కేసులు నమోదు చేస్తే ఎలా? అని పోలీసులకు తలంటింది. ఆజాద్ బెయిల్ విచారణ బుధవారానికి వాయిదాపడింది.