సీఏఏ నిరసనలు: ఏకాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుంది: ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలది ప్రముఖ పాత్ర అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. శాంతియుతంగా చేసే నిరసనలు దేశంలో ప్రజాస్వామ్యంలో చైతన్యం నింపుతాయని అన్నారు. ఏకాభిప్రాయం అనేది ప్రజాస్వామ్యానికి జీవనాడి, అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అని తెలిపారు.
చర్చించడం, వాదించడం, భిన్నాభిప్రాయాలను కూడా వినడం ద్వారా ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుంది.. నిర్లక్ష్యం అనేది అధికార దోరణులను సాధించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. అయితే, నూతన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను, ఆందోళనలను ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు.
గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యానికి మరోసారి పరీక్షా సమయం ఎదుర్కొంటోందని అన్నారు. గత కొద్ది నెలలుగా దేశంలోని చాలా మంది యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని అన్నారు. వారికి రాజ్యాంగంపై ఉన్న నమ్మకం హృదయాలను కదిలిస్తుందన్నారు.
ఢిల్లీలోని జామీయా మిలీయి ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు భారీ ఎత్తున సీఏఏ, ఆన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆందోళనలు ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని కట్టడి చేశారు. పలు సందర్భాల్లో పోలీసులు విద్యార్థులు ఘర్షన వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీఛార్జీ కూడా చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే, కేంద్రమంత్రి అమిత్ షా మాత్రం సీఏఏపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు. సీఏఏ వల్ల భారతీయులకు ఎలాంటి నష్టం లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన మైనార్టీ శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు మాత్రమే సీఏఏను తీసుకొచ్చినట్లు పలుమార్లు ఆయన స్పష్టం చేశారు.