ఎన్ఆర్సీ,సీఏఏ ఎఫెక్ట్ : భారత పర్యాటక రంగానికి బిగ్ డ్యామేజ్..
ఎన్ఆర్సీ,సీఏఏ చట్టాల వల్ల ఎవరికి నష్టం..? ఎవరికి లాభం అన్న చర్చను పక్కనపెడితే.. వాటివల్ల పర్యాటక రంగంపై మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో.. కొన్ని దేశాలు భారత పర్యటనపై హెచ్చరికలు జారీ చేశాయి.అమెరికా,బ్రిటన్,కెనడా,ఫ్రాన్స్,ఇజ్రాయెల్,సింగపూర్,రష్యా తదితర దేశాలు భారత్ వెళ్లే తమ దేశస్తులను హెచ్చరించాయి. ప్రస్తుతం భారత్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా అక్కడికి వెళ్లే ఆలోచనను విరమించుకోవాలని చెప్పాయి.
తాజ్ పర్యటన రద్దు చేసుకున్న 2లక్షల మంది విదేశీ పర్యాటకులు
చాలావరకు పాశ్చాత్య దేశాల్లో డిసెంబర్ నెల నుంచే హాలీడే సీజన్ మొదలవుతుంది. దీంతో ఈ నెల నుంచే ఆయా దేశస్తుల పర్యాటకులు విదేశీ పర్యటనలకు సిద్దమవుతుంటారు. ఈ నేపథ్యంలో భారత్లోని పర్యాటక ప్రదేశాలను వీక్షించేందుకు సిద్దమైన విదేశీ పర్యాటకులకు ఎన్ఆర్సీ,సీఏఏ ఆందోళనలు బ్రేక్ వేశాయి. దీంతో చాలామంది విదేశీ పర్యాటకులు భారత్లో తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. అలా ఒక్క తాజ్మహల్ విషయంలోనే గడిచిన రెండు వారాల్లో దాదాపు 2లక్షల మంది పర్యాటకులు తాజ్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
60శాతం తగ్గిన తాజ్ పర్యాటకం :
గత ఏడాది డిసెంబర్తో పోల్చితే ఈ ఏడాది డిసెంబర్లో తాజ్మహల్ను చూసేందుకు వచ్చిన పర్యాటకుల సంఖ్య 60శాతం తగ్గిపోయిందని స్థానిక ఎస్ఐ దినేశ్ కుమార్ తెలిపారు. చాలామంది స్వదేశీ,విదేశీ పర్యాటకులు తమ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి.. తాజ్మహల్ వద్ద భద్రత గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు.పర్యాటకులకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందని చెప్పినప్పటికీ.. చాలామంది తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నారని తెలిపారు.
ఇంటర్నెట్ షట్డౌన్ కూడా కారణమే..
ఎన్ఆర్సీ,సీఏఏలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కాల్పుల్లో దాదాపు 20 మంది సాధారణ పౌరులు చనిపోయారు. ఆందోళనల కారణంగా ఆగ్రాతో పాటు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. ఇంటర్నెట్ నిలిపివేయడంతో ఆగ్రా టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. దాని కారణంగా దాదాపు 50శాతం నుంచి 60శాతం పర్యాటకులు తాజ్ పర్యటనను రద్దు లేదా వాయిదా వేసుకున్నట్టు ఆగ్రా టూరిజం డెవలప్మెంట్ ఫౌండేషన్ గ్రూప్ అధికారులు తెలిపారు.
ఆర్థికంగా తీవ్ర ప్రభావం :
ఏటా భారత్లో ఒక్క తాజ్మహల్ను చూసేందుకే దాదాపు 6.5మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఫెస్టివల్ సీజన్లో ఎన్ఆర్సీ,సీఏఏ ఆందోళనలు చోటు చేసుకోవడంతో చాలామంది చివరి నిమిషంలో తాజ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వృద్ది రేటు 4.5శాతం మాత్రమే ఉన్న తరుణంలో.. పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోవడం పెద్ద దెబ్బ అంటున్నారు.
ఒక్క ఆగ్రా మాత్రమే కాదు.. అసోం,గోవాపై కూడా ఎఫెక్ట్..
ఎన్ఆర్సీ,సీఏఏ ఆందోళనల ప్రభావం కేవలం ఆగ్రాపై మాత్రమే కాదు అసోం,గోవాలపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రతీ ఏడాది డిసెంబర్ నెలలో దాదాపు 5లక్షల మంది పర్యాటకులు అసోంకు వస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 90శాతం వరకు పడిపోయిందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఇక గోవాలో పెద్దగా ఆందోళనలు చోటు చేసుకోనప్పటికీ.. ఆయా దేశాలు భారత్లో పర్యటనపై హెచ్చరికలు జారీ చేయడంతో చాలామంది విదేశీ ప్రయాణికులు పర్యటనలను రద్దు లేదా వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ డిసెంబర్ నెలలో గోవా పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది.