ముస్లింలను పాకిస్తాన్ పొమ్మంటారా? మీరట్ ఎస్పీపై కేంద్ర మంత్రి నఖ్వీ సీరియస్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద కామెంట్లను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఖండించారు. వీడియోలో కనిపించినట్లు సదరు పోలీసు అధికారి గనుక నిజంగానే ముస్లింలను పాకిస్తాన్ వెళ్లిపోవాలని అనుంటే కచ్చితంగా అతనిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
పోలీసుల్నీ వదిలిపెట్టొద్దు
మీరట్ ఎస్పీ ‘గో బ్యాక్ టు పాకిస్తాన్' వీడియో వైరల్ కావడం, దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మైనార్టీల మంత్రిగా నఖ్వీ స్పందించారు. ‘‘హింస ఏ స్థాయిలో జరిగినా అంగీకరించేదిలేదు. అల్లరిమూకలు కావొచ్చు లేదా పోలీసులే కావచ్చు.. తప్పుచేసిన వాళ్లెవరినీ వదిలిపెట్టొద్దు. మీరట్ ఎస్పీ కామెంట్లు ముమ్మాటికీ వివాదాస్పదమైనవే. ఎవిడెన్స్ పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలి'' అని మంత్రి అన్నారు. సీఏఏ నిరసనల్లో హింసపై పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడిన మొదటి వ్యక్తి నఖ్వీనే కావడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్నా, ఉత్తరప్రదేశ్ లో మాత్రం తీవ్ర హింస చెలరేగింది. ఒక్క యూపీలోనే ఇప్పటిదాకా 21 మంది చనిపోవడంతో అక్కడి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈనెల 20న మీరట్ లోని లిసారీ గేటు దగ్గర సీఏఏ నిరసనలు చేస్తున్న ముస్లింలను ఉద్దేశించి ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్.. ‘‘ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే పాకిస్తాన్ వెళ్లిపోండి.. ఇక్కడి తిండి తింటూ, పక్కదేశాన్ని పొగడటానికి సిగ్గులేదా?'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పోలీస్ వెర్షన్ పై సమాధానం దాటేసిన మంత్రి
కాగా, మీరట్ ఘటనలో ఎస్పీ అఖిలేశ్ సింగ్ ను యూపీ పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకురావడంపై కేంద్ర మంత్రి నఖ్వీ సమాధానం దాటేశారు. పోలీసులపై రాళ్లు విసిరిన నిరసనకారులు ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారని, అందుకే ఎస్పీ భావోద్వేగానికి గురయ్యారని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి స్పందన తర్వాత మీరట్ ఘటనపై యూపీ సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.