పౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్ : ముస్లిం కుటుంబాలకు పోలీసుల వేధింపులు
బిజ్నోర్ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్లో కూడా చట్టంకు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అయితే ఆందోళనకారుల ఇళ్లల్లో పోలీసులు దాడులు నిర్వహించడం, సోదాలు చేయడం వారిని భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో బిజ్నోర్లోని నెహతార్ గ్రామంలో నివసించే ముస్లింలు భయంతో ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
పోలీసుల వేధింపులు
అంతకుముందు జరిగిన ఆందోళనల సందర్భంగా పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. 60 మందిపై కేసు నమోదు చేశారు. మరో 3వేల మంది గుర్తు తెలియని వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆందోళనల సందర్భంగా బిజ్నోర్లో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచే పోలీసులు తమ ఇళ్లల్లోకి చేరి తమ ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసిన పోలీసులు
పోలీసులు ఒక ఇంట్లోకి జొరబడి వాష్బేసిన్, బాత్రూం, బెడ్, ఫర్నీచర్, ఫ్రిడ్జ్, ఇతర పాత్రలను ధ్వంసం చేశారు. తాము ముస్లింలు అయినందునే తమను లక్ష్యంగా చేసుకుని పోలీసులు హింసిస్తున్నారని ఓ అమ్మాయి చెప్పింది. రోజు 8 నుంచి 10 మంది పోలీసులు తమ ఇళ్లకు వచ్చి మగవారి గురించి వాకబు చేస్తూ తమను వేధిస్తున్నారని ఓ మహిళ చెప్పింది. తమకు తెలియదని చెబితే.. మహిళలను వేధిస్తున్నారని చెప్పారు. అంతేకాదు పిల్లలను భయపెట్టి తమ ఇంట్లోని పురుషులు ఎక్కడున్నారో చెప్పాల్సిందిగా పోలీసులు బెదిరిస్తున్నారని స్థానికులు చెప్పారు.
ఇళ్లను విడిచి వెళుతున్న గ్రామస్తులు
ఇక అదే గ్రామం నుంచి మరో ఐదు ఇళ్లకు కూడా తాళం వేసి ఉండటం కనిపించాయి. పోలీసులు తమ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తారన్న భయంతో వారు ఇళ్లను వీడి వెళ్లిపోయారని స్థానికులు చేశారు. మరో ఇంట్లో టీవీ, బాత్రూం, ఫర్నీచర్ను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసుల వేధింపులను తట్టుకోలేక ఒకే గ్రామం నుంచి దాదాపు 8 ముస్లిం కుటుంబాలు ఇళ్లను వీడి వెళ్లిపోయాయి.