సుప్రీంలో సీఏఏ: పిటిషన్ల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామన్న సీజేఐ
ఢిల్లీ: సుప్రీంకోర్టులో పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన 140 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలు కావడంతో అవి దాఖలు చేసిన లిటిగెంట్స్ లాయర్లు కోర్టు హాలులో ఉండటంతో హాలు కిక్కిరిసి పోయింది. దీంతో సెక్యూరిటీని లోపలికి పిలిపించారు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. కోర్టు హాలు కిక్కిరిసిపోవడంతో లాయర్ల వాదనలు తనకు వినిపించడంలేదని చీఫ్ జస్టిస్ చెప్పారు. కోర్టులో అంతమంది అసవరమా అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సీఏఏపై స్టే ఇవ్వలేమన్న చీఫ్ జస్టిస్ బాబ్డే
మరోవైపు సీఏఏ అమలుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. పెద్ద సంఖ్యలో దాఖలైన పిటిషన్లను విచారణ చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఇక కేంద్రానికి కూడా పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు 4వారాల సమయం ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకు స్టే ఇవ్వలేమని పేర్కొంది. ఇక అదే సమయంలో సీఏఏపై పిటిషన్లను ఏ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టరాదని పేర్కొంది.
ఎన్పీఆర్ ప్రక్రియను మరి కొంత కాలం నిలిపివేయాలి
ఇక కేసులో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అన్ని పిటిషన్లు వచ్చాయా లేదా అని ప్రశ్నించారు. రేపు ఇదే అంశంకు సంబంధించి మరొకరు కొత్త పిటిషన్ వేసి తన పిటిషన్పై వాదనలు వినాలని చెబితే కుదరదని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన మొత్తం 144 పిటిషన్లను కోర్టు విచారణ చేస్తోందని స్పష్టంగా చెప్పారు. ఇక వాదనల సందర్భంగా ఏప్రిల్లో ఎన్పీఆర్ ప్రక్రియ ప్రారంభం కానుందని ఈ ప్రక్రియను మరికొంత కాలం పాటు నిలిపివేయాలని కోరారు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబాల్. అయితే అస్సాంలో పరిస్థితి చేదాటిపోతోందని దానిపై మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడే ఇవ్వాలని మరో సీనియర్ కౌన్సిల్ వికాస్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు.
కొత్త చట్టం అస్సాం ఒప్పందంను ఉల్లంఘించేలా ఉంది
ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఎన్పీఆర్ ప్రక్రియను ప్రారంభించాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు మరో సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ. ఇక కొత్తగా తీసుకొచ్చిన చట్టం అస్సాం ఒప్పందంను ఉల్లంఘించేలా ఉందని వికాస్ సింగ్ చెప్పారు. 1971 వరకు బంగ్లాదేశ్లో మైనార్టీలు భారత్కు వచ్చే వెసులుబాటు ఉన్నిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన వికాస్ సింగ్... కటాఫ్ తేదీని రివైజ్ చేయడంతో అస్సాం ఒప్పందంను ఉల్లంఘించేలా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే కేంద్రం కూడా పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఆయా రాష్ట్ర హైకోర్టులకు విచారణ బదిలీ చేయాలంటూ పేర్కొంది. అయితే ఇందుకు కోర్టు అంగీకరించలేదు. రాష్ట్ర హైకోర్టులు విచారణ చేపట్టరాదని రూలింగ్ ఇచ్చింది.