కరోనా టీకాల తర్వాత సీఏఏ అమలు -అమిత్ షా వెల్లడి -నందిగ్రామ్లో పోటీపై మమత సవాల్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై వెనుకడుగు వేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఏఏను పున:ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, బీజేపీ ఆటలను బెంగాల్ లో సాగనీయబోమంటోన్న టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ.. కేంద్ర మంత్రిని మరో సవాలు విసిరారు..
2019 చివర నుంచి గతేడాది కరోనా లాక్ డౌన్ ముందు వరకూ సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు దేశాన్ని అట్టుడికించిన సంగతి తెలిసిందే. కాగా, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వదంతులను నమ్మవద్దని అమిత్ షా కోరారు. పశ్చిమ బెంగాల్లోని మతువాలో గురువారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన వెంటనే అందరికీ పౌరసత్వం ఇస్తామన్నారు.
సీఏఏ ద్వారా ముస్లింల పౌరసత్వాన్ని తొలగించే నిబంధన ఏదీ ఈ చట్టంలో లేదని, గడచిన 70 ఏళ్ళ నుంచి భారత దేశంలో నివసిస్తున్నవారందరికీ పౌరసత్వం ఇస్తామని, సీఏఏపై పుకార్లను ప్రచారం చేసేవారి చేతుల్లో పావులుగా మారవద్దని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. బీజేపీని సీఎం మమతా బెనర్జీ వాషింగ్ మెషిన్గా అభివర్ణించారు. అందులోకి వెళ్లిన వారు నలుపు నుంచి తెలుపు వర్ణంలోకి మారతారని ఎద్దేవా చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా గురువారం నిర్వహించిన బెంగాల్ పర్యటనపై సీఎం మమత రుసరుసలాడారు. షా పర్యటనపై స్పందించబోనంటూనే.. ఎవరికైనా బెంగాల్ లో పర్యటించే హక్కు ఉందని, ఒక్కడికొచ్చి ఏదైనా మాట్లాడొచ్చని అన్నారు. అయితే షా మాత్రం బెంగాల్ వచ్చినప్పుడల్లా బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. అమిత్షా నందిగ్రామ్లో పోటీ చేస్తారా? అంటూ మమత సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ మరోసారి విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యాక్తం చేశారు.