హిందువులకూ నష్టం తప్పదు.. సీఏఏపై కేజ్రీవాల్ కామెంట్స్
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది ఒక పనికిమాలిన చట్టమని, దానివల్ల దేశానికి ఎలాంటి ఉపయోగంలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీఏఏ వల్ల ముస్లింలతోపాటు రాబోయేరోజుల్లో హిందువులకు కూడా నష్టం తప్పదని చెప్పారు. శుక్రవారం టౌన్ హాల్ మీటింగ్ లో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
సీఏఏ అండ చూసుకుని పాకిస్తాన్ లోని రెండు కోట్ల మంది హిందువులు ఇండియాకు వస్తే వాళ్లకు ఎక్కడ, ఎలా ఆశ్రయం కల్పిస్తారో కేంద్ర ప్రభుత్వానికైనా క్లారిటీ ఉందో లేదో అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశానికి ఏమాత్రం ఉపయోగం లేని సీఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రాన్ని చేతులు జోడించి వేడుకుంటానని ఢిల్లీ సీఎం అన్నారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు పరిష్కారం కావాలని, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యంపై ఫోకస్ పెట్టాల్సిన కేంద్రం.. సీఏఏ లాంటి పనికిరాని చట్టాలతో కాలయాపన చేస్తుండటం విచారకరమని కేజ్రీవాల్ అన్నారు. ఏ ప్రభుత్వమైనా ముందు తన ప్రజల అవసరాలు తీర్చిన తర్వాతే పక్క దేశాల గురించి ఆలోచిస్తుందని, మోదీ సర్కార్ మాత్రం రివర్స్ లో పనిచేస్తోందని ఢిల్లీ సీఎం ఫైరయ్యారు.