దేశ రాజధానిలో సేవలను నిలిపివేసిన ఎయిర్ టెల్: అదే బాటలో వొడాఫోన్-ఐడియా.. !
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ ఫోన్ ఆపరేటర్లు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశ రాజధానిలో తమ సర్వీసులన్నింటినీ నిలిపివేశారు. ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా సంస్థలు తమ సేవలన్నింటినీ స్తంభింపజేశారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు నేపథ్యంలో న్యూఢిల్లీలో హింసాత్మక వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో.. ఆయా సంస్థలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితిలోకి వచ్చిన తరువాత సేవలను పునరుద్ధరిస్తామని వెల్లడించాయి.
HCU: రణరంగంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థుల అరెస్ట్: వందమందికి పైగా.
ఉద్రిక్తతల నేపథ్యంలో..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినప్పటి నుంచీ పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. మొదట్లో ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఈ అల్లర్లు.. క్రమంగా పలు రాష్ట్రాలకు వ్యాపించాయి. న్యూఢిల్లీని సైతం వణికిస్తున్నాయి. అదే సమయంలో జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం, క్యాంపస్ లోకి ప్రవేశించి మరీ వారిని అరెస్టు చేయడం వంటి పరిణామాలు వెంటవెంటనే చోటు చేసుకున్నాయి.
హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు..
న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున పారా మిలటరీ బలగాలను మోహరింపజేసినప్పటికీ.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా రోజురోజుకూ అల్లర్లు చెలరేగుతూనే వస్తున్నాయి. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. సీలంపూర్, జఫ్రాబాద్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇటీవలే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోగా.. గురువారం నాటికి అవి ఎర్రకోట వరకూ ప్రబలిపోయాయి. ఢిల్లీ నగరం మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది.
ఎయిర్ టెల్ సహా..
మొబైల్ ఫోన్ల సేవలను నిలిపి వేయాలని ఆపరేటర్లకు సూచించింది. దీనితో భారతీ ఎయిర్ టెల్ సంస్థ యాజమాన్యం.. తమ సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది. భారతీ ఎయిర్ టెల్ తన నిర్ణయాన్ని వెల్లడించిన కొద్ది సేపటికే వొడాఫోన్-ఐడియా సంస్థలు కూడా అవే బాటలో నడిచాయి. వాయిస్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సహా అన్ని రకాల సేవలను తక్షణమే నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా సంస్థలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత తమ సేవలను పునరుద్ధరిస్తామని వెల్లడించాయి.
ఏఏ ప్రాంతాల్లో స్తంభించిపోయాయంటే..
ఢిల్లీలో అత్యంత రద్దీతో కూడుకుని ఉండే ఐటీఓ, వల్లాడ్ సిటీ ఏరియా, మండీ హౌస్, సీలంపూర్, జఫ్రాబాద్, షహీన్ బాగ్, జామియా నగర్, ముస్తఫాబాద్ వంటి సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో తమ సేవలను నిలిపి వేశామని వెల్లడించాయి. అశోకా రోడ్ నుంచి ఇండియా గేట్ వరకు వెళ్లే మార్గం పొడవునా మొబైల్ సేవలు అందుబాటులో లేవని పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండే తమ టవర్ల నుంచి వెలువడే సిగ్నళ్లను స్తంభింపజేసినట్లు తెలిపాయి.