పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోడీ
పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు వస్తోంది. దీంతో బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలని అధికార బీజేపీ భావిస్తోంది. సభ ప్రారంభమవడానికి ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మోడీ హాజరు
పార్లమెంట్ లైబ్రరీలో జరిగిన సమావేశానికి ప్రధాని మోడీ విచ్చేశారు. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యుహాంపై తమ పార్టీ నేతలకు బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు సభకు ఎంతమంది హాజరవుతారు ? గైర్హాజరయ్యేవారి డేటాపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు దృష్టిసారించారు. ఇటీవల సభకు తక్కువమంది హాజరవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో సభ్యుల హాజరు ముఖ్యమైనదని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది హాజరవడం లేదన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు
పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల్లో అగ్గిరాజేసింది. సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అవమానించడమేనని పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ చర్యను ఆప్ నేత సంజయ్ సింగ్ తప్పుపట్టారు.
ఇదీ లెక్క
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240 కాగా.. బీజేపీకి 83 మంది ఉన్నారు. జేడీయూ, ఎస్ఏడీ, ఏఐఏడీఎంకే, బీజేడీ, వైసీపీతో గట్టెక్కచ్చని భావిస్తోంది. బీజేపీ 83, జేడీయూ, ఎస్ఏడీ మూడు చొప్పున అన్నాడీఎంకే 11, బీజేడీ 7, వైసీపీ ఇద్దరు సభ్యులతో తమ సంఖ్య 128కి చేరుతుందని భావిస్తోంది. దీంతో సులభంగా గట్టెక్కుతామని చెబుతుంది. శివసేనకు లెక్కగట్టకున్నా.. జేడీయూ ఎలా వ్యవహరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
బలంగా విపక్షం
ఇక విపక్ష కూటమికి 112 ఓట్లతో బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కూడా వీరికి జతకానుంది. లోక్సభ ఓటింగ్లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.