పౌరసత్వ చట్టం: 18న అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల విధుల బహిష్కరణ, యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
గౌహతి: పౌరసత్వ చట్టం వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అస్సాం, పశ్చిమబెంగాల్, మేఘాలయాలలో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. కాగా, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు తాము డిసెబర్ 18న విధులను బహిష్కరించనున్నట్లు ప్రకటించారు.
సడౌ అసాం కర్మచారి పరిషద్(ఎస్ఏకేపీ) అధ్యక్షుడు బాసబ్ కలిట పీటీఐతో మాట్లాడుతూ.. డిసెంబర్ 18 అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా విధులకు హాజరుకారని చెప్పారు. తాము మొదటి నుంచి పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆ చట్టాన్ని ఎత్తివేసే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సభ్యులు గత సంవత్సరం మే నెలలో అస్సాం ప్రజల అభిప్రాయాలను తీసుకుందని.. తాము బిల్లుకు వ్యతిరేకంగానే మెమోరాండం ఇచ్చామని ఆయన తెలిపారు. డిసెంబర్ 16 నుంచి ఏఏఎస్యూ చేపడుతున్న మూడు రోజుల సత్యాగ్రహానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
అస్సాం, మేఘాలయా రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఎన్ఈటీ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మిగితా ప్రాంతాల్లో ఆదివారంనాడు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా పరీక్ష జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిరసనకారులు తీవ్ర విధ్వంసానికి దిగారు. ఇప్పటికే ఒక రైల్వే స్టేషన్కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. ఓ రైల్వే స్టేషన్లో నిలిపిఉంచిన ఐదు రైళ్లకు నిప్పంటించారు. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగిస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. కాగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్, సీఎం మమతా బెనర్జీ ఆందోళకారులు శాంతించాలని, సంయమనం పాటించాలని కోరారు. విధ్వంసానికి పాల్పడవద్దని సూచించారు.