4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు 59వేల కోట్ల స్కాలర్షిప్: కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించేందుకు మొత్తం రూ. 59 వేల కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. ఇందులో 60 శాతం శాతం కేంద్రం భరించనుండగా, 40 శాతం ప్రభుత్వాలు భరించనున్నాయని కేంద్రమంత్రి థావర్ చంద్ర గెహ్లాట్ తెలిపారు.
Recommended Video
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, థావర్ చంద్ గెహ్లాట్ మీడియాకు వెల్లడించారు. కాగా, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పలు విభాగాలను విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఫిల్మ్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ విభాగాలను విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. డీటీహెచ్ సేవలకు సంబంధించిన సవరించిన మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.
డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య మౌలిక సదుపాయాలను పంచుకునేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పదేళ్లకే ఇస్తున్న లైసెన్స్ను ఇకపై 20 ఏళ్లకు జారీ చేయనున్నారు. అలాగే డీటీహెచ్ రంగంలో నూరు శాతం ఎప్డీఐలకు అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇది 49 శాతంగా ఉంది. లైసెన్స్ ఫీజును ఏడాదికి బదులు ఇక నుంచి మూడు నెలలకు ఓసారి వసూలు చేయనుంది.