అబార్షన్ చేయించుకోవడానికి 24 వారాల వరకూ గడువు: కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: అబార్షన్ చేయించుకోవడానికి చట్టపరమైన గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై 24 వారాల వరకూ అబార్షన్ చేయించుకునే వెసలుబాటును కల్పించింది. ఈ మేరకు మెడికల్ టెర్మినాలజీ ఆఫ్ ప్రెగెన్సీ చట్టంలో సవరణలను చేసింది. ఈ సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ సవరణ ప్రతిపాదనలు త్వరలో బిల్లు రూపంలో పార్లమెంట్ సమక్షానికి రానున్నాయి.
ప్రస్తుతం చట్టపరంగా అబార్షన్ చేయించుకోవడానికి అమలులో ఉన్న గడువు 20 వారాలు. ఈ గడువు దాటిన తరువాత అబార్షన్ చేయడం చట్టపరంగా నేరంగా భావిస్తారు. 20 వారాల గడువు దాటిన తరువాత అబార్షన్ చేసే ఆసుపత్రులు గానీ, క్లినిక్లపై గానీ చట్టపరంగా క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి అవకాశం ఉండేది. ఈ గడువును 20 నుంచి 24 వారాలకు పెంచాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. 1971 నుంచీ మెడికల్ టెర్మినాలజీ ఆఫ్ ప్రెగెన్సీ చట్టం ఎలాంటి సవరణలకూ నోచుకోలేదని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని సవరించాల్సి వచ్చిందని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.
ఈ అంశంపై అధ్యయనం చేయడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై కూలంకషంగా చర్చించామని, చట్టంలో సవరణలు చేయడానికి, అందులో కొత్తగా తీసుకుని రావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రుల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. ఆ తరువాతే.. ప్రెగ్నెన్సీ చట్టంలో సవరణల ప్రతిపాదనలను ఆమోదించామని చెప్పారు.