జమ్మూకాశ్మీర్లో కేంద్ర చట్టాల అమలుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఇక నుంచి కేంద్ర చట్టాలు కూడా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు కానున్నాయి. తాజాగా, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట్టాల అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఈ చట్టాలు అమలు కావాలంటే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరిగా ఉండేది.
కానీ, గత సంవత్సరం ఆగస్టులో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ గత అక్టోబర్ 31 నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో గత అక్టోబర్ 31 నుంచే కేంద్ర చట్టాలు కూడా ఇక్కడ అమలవుతాయన్నమాట.
ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ పునర్ వ్వవస్థీకరణ చట్టం కింద కేంద్ర చట్టాల అమలుకు ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.
సరోగసీ క్రమబద్ధీకరణ బిల్లుకు రాజ్యసభ సెలక్ట్ కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి తెలిపారు. సరోగేట్గా మారేందుకు సదరు మహిళ సమీప బంధువే కానక్కర్లేదని సెలక్ట్ కమిటీ సూచించిందని చెప్పారు. ఈ బిల్లుకు మొత్తం 15 సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన జాతీయ టెక్నికల్ మిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో సీఏఏపై ఆందోళనలపై పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరించారు.
ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న హింసకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని.. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అమాయక సిక్కుల రక్తంతో తడిసిన చేతులు వాళ్లవని, అలాంటి వారు ఇవాళ హింస గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఢిల్లీ పరిస్థితిని ఎప్పటికప్పుడు హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నారని జవదేకర్ తెలిపారు. అలాంటి వ్యక్తిని రాజీనామా చేయమనడం హాస్యాస్పదమేనని అన్నారు. ఇలాంటి విషయాలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు.