సుజనా వర్సెస్ సిఎం: మోడీ కొలువులో కొత్తగా వీరే?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీ ఓ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరికే ఆ ఒక్క మంత్రి పదవి వెళ్తుందనే ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు. అంతే కాకుండా బిజెపికి కూడా మంచి మిత్రులు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన అశోక్ గజపతి రాజు ఇప్పటికే మోడీ మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన ముఖ్యమైన పౌర విమానయాన శాఖను నిర్వహిస్తున్నారు. మరో మంత్రి పదవిని కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుడికే ఇప్పిస్తారా అనేది చూడాల్సే ఉంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డిని మంత్రి పదవికి సిఫార్సు చేయవచ్చునని భావిస్తున్నారు.
మల్లారెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తే ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేసినట్లవుతుంది. దాంతో మల్లారెడ్డి పేరు కూడా తెర మీదికి వచ్చింది. అయితే, అనుకోకుండా మల్లారెడ్డికి ఓ ఆటంకం ఎదురైనట్లు కనిపిస్తోంది. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల విద్యాసంస్థలు అక్రమ నిర్మాణాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ గౌడ్ అనే వ్యక్తి నాలుగు లిఖితపూర్వక పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ఆదివారం ఒంటి గంటకు నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు. పది మందిని కొత్తగా ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. కొత్త ముఖాలకు మోడీ విస్తరణలో అవకాశం కల్పిస్తారని అంటున్నారు. దీంతో టిడిపి నుంచి దివంగత నేత కింజారపు తనయుడు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు రామ్మోహన నాయుడుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం సాగుతోంది.
ఎర్రంనాయుడికి ఢిల్లీ రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉండేది. కాంగ్రెసేతర రాజకీయ పక్షాలను కూడగట్టడంలో ఆయన విశేషమైన కృషి చేశారు. ఎర్రంనాయుడి సేవలకు గుర్తింపుగా రామ్మోహన నాయుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. కానీ చంద్రబాబు ఏ మాత్రం అనుభవం లేని రామ్మోహన నాయుడిని మంత్రి పదవికి సిఫార్సు చేస్తారా అనేది అనుమానమే. ఒకవేళ అదే జరిగితే, సుజనా చౌదరి, సిఎం రమేష్ల్లో ఏ ఒక్కరినో సంతృప్తి పరిచి, మరొకరిని అసంతృప్తికి గురి చేయడం ఇష్టం లేకనే చంద్రబాబు అందుకు అంగీకరించారని భావించాల్సి ఉంటుంది.
పది మంది వీరే?
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కొత్తగా చేరే వారి పేర్లపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మనోహర్ పరిక్కర్, జయంత్ సిన్హా, గిరి రాజ్, రామ్ కృపాల్ యాదవ్, నఖ్వీ, సుజనా చౌదరి, అజయ్ టాంటా, హన్సరాజ్, రమేష్ బియాస్, విజయ్ సంప్లా, వీరేందర్ కశ్యప్, బీరేందర్ సింగ్లకు మోడీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.