వివాదాస్పద పౌరసవరణ బిల్లుకు కేబినెట్ లైన్ క్లియర్...బిల్లుతో ఎవరికి లాభం ఎవరికి నష్టం?
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ వారంలోనే అది పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నిస్తోంది. ఈశాన్య భారతంకు చెందిన రాష్ట్రాలు సిటిజెన్షిప్ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు పౌరసత్వ సవరణ బిల్లు మూలాలేంటి..? కేంద్రం ఈ బిల్లుకు సవరణ తీసుకురావడం ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం..?
Recommended Video
వివాదాస్పద సిటిజెన్షిప్ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వారంలోనే సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేస్తూ బిల్లును కేంద్రం రూపొందించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా భారత్లో స్థిరపడిన హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు, పార్శీలకు, క్రైస్తవులకు భారతదేశ పౌరసత్వం కల్పించేలా సవరణలు చేసింది.
ముస్లింలకు నష్టం చేకూరుస్తుందా..?
పాకిస్తాన్లో వివక్షకు గురై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షియాలు, అహ్మదీయులకు ఈ ప్రతిపాదించిన బిల్లులో చోటు ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు వలసదారులు 11 ఏళ్లుగా భారత్లో నివసిస్తున్నట్లయితే వారికి భారత పౌరసత్వం ఇవ్వాలని ఉండగా...దాన్ని ఆరేళ్లకే తగ్గిస్తూ కేంద్ర తాజాగా సవరణలు చేసింది.
NRCకి పౌరసత్వ బిల్లుకు ఏంటి సంబంధం..?
పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన హిందువులకు పౌరసత్వ బిల్లు రక్షణ కల్పిస్తుండగా... ఎన్ఆర్సీ మాత్రం మత ప్రాతిపదికన కాకుండా భారత్కు మార్చి 24, 1971 తర్వాత వచ్చి స్థిరపడ్డ అక్రమవలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించేలా రూపొందించారు. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి తమ దేశాలకు పంపే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. ఇక బిల్లు అమల్లోకి వస్తే ముస్లింయేతర ప్రజలకు ఎలాంటి హానీ ఉండదు. అయితే ముస్లింలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబికే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.
పలు విద్యార్థి సంఘాలతో అమిత్ షా చర్చలు
అంతకు ముందు అంటే మంగళవారం రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్సాంకు చెందిన విద్యార్థి సంఘాలతో, సామాజిక పౌర సంఘాలతో చర్చలు జరిపారు. వీరు కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ బిల్లను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అమిత్ షా చర్చలు జరిపిన వారిలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ తమ వాదనలను ఆయన ముందు వినిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రతిపాదిత బిల్లు ఈశాన్య రాష్ట్రంలో ఉంటున్న అసలైన భారతీయులపై ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. అంతేకాదు 1985 అస్సాం ఒప్పందాన్ని ప్రతిపాదిత పౌరసత్వ సవరణ బిల్లు హాని కలిగించేలా ఉందని పెద్ద సంఖ్యలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాలు అభ్యంతరం తెలిపాయి.
బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ఈశాన్య రాష్ట్రాలు
ఇక కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐఎంతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా బిల్లను వ్యతిరేకిస్తున్నాయి. మత ప్రాదిపతికన పౌరసత్వం ఇవ్వరాదని చెబుతున్నాయి. గతవారం 12 మంది బీజేపీయేతర ఎంపీలు ప్రధాని మోడీని కలిసి ఈశాన్య రాష్ట్ర ప్రజలు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ బిల్లు వస్తే పెద్ద సంఖ్యలో గిరిజనులకు హాని చేకూరుస్తుందనే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తొలిసారిగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించింది. అయితే ఈశాన్య రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యతిరేకత వ్యక్తం అవడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. లోక్సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు అయ్యింది.
బిల్లు అమలైతే ఎంతమంది లబ్ధి పొందుతారు..?
ఇక పాత బిల్లు ప్రకారం 2014 డిసెంబర్ 31వరకు ఎవరైతే భారత్లో వచ్చి స్థిరపడ్డారో బిల్లు అమల్లోకి వస్తే లాభపడతారు. ఇక ఈ బిల్లు ద్వారా అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన వారు దాదాపు 31వేల మంది లబ్ధిపొందుతారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు లబ్ధి పొందుతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇంటెలిజెన్స్ బ్యూరో వలసదారులకు సంబంధించి సమాచారం ఇచ్చింది. దాదాపు 31,313 వలసదారులు ఈ బిల్లు అమలుతో లబ్ది పొందుతారని ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలో చెప్పింది.