సిక్కుల కోసం: పాక్లోని కర్తాపూర్ గురుద్వారా కారిడార్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ మరో కీలకమైన అంశానికి ఆమోదం తెలిపింది. పాకిస్తాన్లోని కర్తాపూర్ గురుద్వారాకు రహదారి నిర్మాణంతో పాటు సదుపాయాలు కల్పించేందుకు కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. సిక్కులు కర్తాపూర్ గురుద్వారాను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు సిక్కుల మతగురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపినట్లు విశ్వసిస్తారు.
"పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నుంచి పాకిస్తాన్లోని కర్తాపూర్లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయం గురుద్వారా వరకు రోడ్డు నిర్మాణంతో పాటు భక్తులకు సరైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది" అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. అంతేకాదు సిక్కుల సెంటిమెంట్లను గౌరవించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా భారత ప్రభుత్వం కోరుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఒక కేంద్రం ఒక మంచి నిర్ణయం తీసుకుందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. సిక్కుల సెంటిమెంటును గౌరవిస్తూ కర్తాపూర్ గురుద్వారాకు సిక్కులు చేరేందుకు సరైన రహదారి నిర్మించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ నేత పంజాబ్ మంత్రి సిద్ధూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సమయంలో ఆ దేశ ఆర్మీ ఛీఫ్ను కౌగలించుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. భారత్లో సిక్కుల కర్తాపూర్ గురుద్వారాను సందర్శించుకునేలా ఏర్పాటు చేస్తామని ఆర్మీ ఛీఫ్ చెప్పడంతోనే తనను కౌగలించుకున్నట్లు సిద్ధూ చెప్పారు. ఆ సమయంలోనే కర్తాపూర్ గురుద్వారా వార్తల్లో నిలిచింది.