ఇకపై కార్డు చెల్లింపులకు అదనపు ఛార్జీలుండవు
న్యూఢిల్లీ: నగదుతో జరిగే లావాదేవీలు తగ్గించి, క్రెడిట్/డెబిట్ కార్డులు, ఆన్లైన్/మొబైల్ చెల్లింపులు, నగదు బదిలీ సేవలను ప్రోత్సహించే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు లావాదేవీలు, ఆన్లైన్ చెల్లింపులకు సర్ఛార్జి, సేవారుసుం (సర్వీస్ఛార్జీ)లను పరిహరిస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది.
ఇందువల్ల కొనుగోలుదార్లు, విక్రయదార్లకు కూడా మేలు కలుగుతుంది. భారీ మొత్తం నగదు లావాదేవీల్లో భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే, డిజిటల్ చెల్లింపుల్లో ఈ బెడద ఉండదు. ఒక పరిమితికి మించిన చెల్లింపును కేవలం కార్డు లేదా ఆన్లైన్లోనే తప్పనిసరిగా జరపాలన్న ప్రతిపాదనను మోడీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
వీటిల్లో పలు నిర్ణయాలను స్వల్పకాలం (ఏడాది లోపు), మరికొన్ని మధ్యకాలం (రెండేళ్లలోపు) అమలు చేయాల్సి ఉంది. మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. నగదు లావాదేవీలను సాధ్యమైనంత తగ్గించే యత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. అధీకృత చెల్లింపు వ్యవస్థలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెస్తోంది.
కార్డు/ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించడం అంటే వీటిద్వారా జరిగే చెల్లింపులపై సర్ఛార్జి, సేవారుసుం, సౌలభ్యరుసుం (కన్వీనియెంట్ ఫీ) రద్దు చేయడమే. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ సంస్థలు కూడా కార్డు/ఆన్లైన్ చెల్లింపులకు రుసుం వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపుల ప్రమేయాన్ని తగ్గించేందుకు, డిజిటల్ కార్డుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఆన్లైన్లో చేసుకునే మోసపూరిత ఆర్థిక లావాదేవీలను తగ్గించేందుకు, ఖాతాదారులకు భరోసా కల్పించే వ్యవస్థలను నెలకొల్పనున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు ఈ వ్యవస్థలు వేగంగా స్పందిస్తాయి.
ఇప్పటికే చేపట్టిన ఎలక్ట్రానిక్ క్లియరింగ్ పేమెంట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), రియల్టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ స్కీమ్ (ఆర్టీజీఎస్) పద్ధతులు సౌకర్యవంతంగా ఉన్నా, అన్ని వర్గాల వారికి ఇంకా చేరువ కావాల్సి ఉంది. మొదటి, రెండో అంచె నగరాలలో బ్యాంకింగ్ సేవలు వినియోగిస్తున్న వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.