బిగ్ డీల్ : తేజాస్ యుద్ద విమానాల కొనుగోళ్లకు భారీ ఒప్పందం... కేంద్రం గ్రీన్ సిగ్నల్..
భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం(జనవరి 13) ప్రధాని నరేంద్ర మోదీ నేత్రుత్వంలో సమావేశమైన ఈ కేబినెట్ కమిటీ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) నుంచి 83 తేజాస్ యుద్ద విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.48వేల కోట్ల డీల్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దేశీ మిలటరీ ఏవియేషన్ సెక్టార్లో ఇదే అతిపెద్ద డీల్గా నిలిచిపోనుంది.
ఎంకె-1A,ఎంకె-1 విమానాల కొనుగోలు...
తాజా ఒప్పందంలో భాగంగా 73 తేలికపాటి తేజాస్ యుద్ద విమానాలను(ఎంకె-1A),10 తేలికపాటి తేజాస్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్లను(ఎంకె-1) విమానాలను కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.45,696కోట్లు ఖర్చు చేయనుండగా.. మరో రూ.1,202కోట్లు మౌలిక సదుపాయాల రూపకల్పన,అభివృద్ది కోసం ఖర్చు చేయనున్నారు. తాజా రక్షణ ఒప్పందాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రక్షణ రంగంలో భారత్ స్వయం స్వావలంబన దిశగా ఈ భారీ ఒప్పందం ఒక గేమ్-ఛేంజర్లా దోహదపడుతుందన్నారు.
అత్యాధునిక సామర్థ్యాలతో...
తేజాస్ తేలికపాటి యుద్దవిమానం Mk-1A వేరియంట్ దేశీయంగా అభివృద్ధి చేయబడిన అత్యాధునిక ఫోర్ ప్లస్ తరానికి చెందిన యుద్ధ విమానం. యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ ఆరే (AESA) రాడార్, బియాండ్ విజువల్ రేంజ్ (BVR) క్షిపణి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (EW) సూట్ , ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ (AAR) వంటి క్లిష్టమైన సామర్థ్యాలు దీని సొంతం. రాబోయే సంవత్సరాల్లో ఈ విమానాలు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు వెన్నెముకగా నిలుస్తాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
దేశీయ రక్షణ రంగ ఉత్పత్తులకు బూస్టింగ్...
హిందూస్తాన్ ఏరోనాటిక్స్తో ఈ ఒప్పందం ఆత్మనిర్భర్ భారత్కు ప్రోత్సాహకం వంటిదని... దేశీయ రక్షణ రంగ ఉత్పత్తులకు ఇది దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే నాసిక్,బెంగళూరు నగరాల్లో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ సెకండ్ లైన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసిందని తెలిపింది. తేజాస్ యుద్ద విమానాల రూపకల్పన కోసం భారత్లోని దాదాపు 500 చిన్న,మధ్య తరహా పరిశ్రమలు హిందూస్తాన్ ఏరోనాటిక్స్తో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేసింది.