దళితుల విజయం: ఎస్సీ /ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథావిధిగానే ఉంచేందుకు కేంద్రం ఓకే
ఢిల్లీ: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథావిధిగా ఉంచేందుకు తీసుకురావాల్సిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈనెల 9న దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన అట్రాసిటీ చట్టం ఇదివరకు ఎలాగైతే ఉందో... అలానే కొనసాగించేలా కేంద్రం మరో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది మార్చిలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దళితులపై దాడి చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే అందుకు కారణమైన వారిని ఎలాంటి విచారణ చేయకుండా అరెస్టు చేయడం సరికాదని తన తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఇప్పుడున్న చట్టాన్ని నీరుగారిస్తే భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని విపక్షాలు, దళిత సంఘాలు హెచ్చరించాయి.
చట్టం అమలులో ఉండగానే దళితులపై ఇన్ని దారుణాలు జరుగుతుంటే.. చట్టం నీరుగారిపోతే ఇక దళితులపై దాడులకు హద్దు ఉండదని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నాడు పిటిషన్ను విచారణ చేసిన సుప్రీం కోర్టు జడ్జీలు జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ లలిత్లు దళితులపై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేశారు. ప్రభుత్వ ఉద్యోగిని విచారణ చేయాలంటే పై అధికారుల అనుమతి తీసుకున్నాకే ఎంక్వైరీ చేయాలని సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై పలువురు దళిత కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి తీసుకొచ్చారు. బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి అధినేత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యధావిధిగా ఉండేలా పార్లమెంటులో కొత్త బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాంవిలాస్ అభ్యర్థనకు అధికార పార్టీలోని పలువురు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. మరోవైపు ఆగష్టు 9న దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అలర్ట్ అయ్యింది ప్రభుత్వం. ఏప్రిల్ 2న జరిగిన భారత్ బంద్లో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో 12 మంది ఆందోళనకారులు మృతి చెందారు. దీంతో కేంద్రం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బిల్లు యథావిధంగా కొనసాగేందుకు మరో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు అడుగులు వేస్తోంది.