చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరి శిక్షే: ఆర్డినెన్స్కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తీవ్రమైన శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది. శనివారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం చిన్నారులపై అత్యాచారాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది.
పోస్కో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం జరిపివారికి మరణశిక్ష విధించేలా చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
చట్ట సవరణ కోసం రాష్ట్రపతికి నివేదించనున్నారు. అంతేగాక, చిన్నారులపై అత్యాచారాల కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం నిర్ణయించింది.
ఇటీవల చిన్నారులపై జరిగిన అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే శిక్షలు మరింత కఠినంగా ఉండాలని బాధితుల కుటుంబసభ్యులు, ప్రజాసంఘలు, ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు చట్ట సవరణ చేసింది.