కాఫీ డే ఆస్థులు అమ్ముకుంటోంది..! బెంగళూరులోని 90 ఎకరాల ఐటీ పార్క్ పై కీలక నిర్ణయం..!!
బెంగళూరు: కాఫీ కింగ్ వి.జి. సిద్దార్థ మృతితో కేఫ్ కాఫీ డే భవిష్యత్తు ఏమిటి ? అనే చర్చ మొదలైయ్యింది. వి.జి. సిద్దార్థకు చెందిన బెంగళూరులోని 90 ఎకరాలు ఐటీ పార్క్ విక్రయించాలని సీడీఇఎన్ నిర్ణయం తీసుకుంది. కాఫీ డే కింగ్ వి.జి. సిద్దార్థ స్థాపించిన కాఫీ డేని నష్టాల నుంచి తప్పించాలని ఐటీ పార్క్ విక్రయించాలని నిర్ణయించారు. సీడీఇఎల్ లో సిద్దార్థ భార్య మాళవికా హెగ్డేకి ప్రత్యేక అధికారాలు ఇచ్చారు.
కేఫ్ కాఫీ డే నిర్ణయం
కాఫీ డే వ్యవహారాలను కాఫీ డే ఎంటర్ ప్రైసస్ లిమిటెడ్ (సీడీఇఎల్) బెంగళూరులోని ఐటీ పార్క్ విక్రయించాలని నిర్ణయించింది. ఐటీ పార్క్ ను విక్రయించి కాఫీ డే సంస్థను నష్టాల భారి నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించారు.
కాఫీ కింగ్ 90 ఎకరాల ఐటీ పార్క్
బెంగళూరులో వి.జి. సిద్దార్థకు చెందిన 90 ఎకరాల ప్రాంతంలో గ్లోబల్ విలేజ్ ఉంది. ఇది కేఫ్ కాఫీ డే వి.జి. సిద్దార్థ ఆస్తి. వి.జి. సిద్దార్థకు చెందిన 90 ఎకరాల ఐటీ పార్క్ ను న్యూయార్క్ కు చెందిన బ్లాక్ స్టోన్ గ్రూప్ కొనుగోలు చెయ్యడానికి ముందుకు వచ్చింది.
చర్చకు గ్లోబల్ విలేజ్
ఇప్పటికే గ్లోబల్ విలేజ్ ను విక్రయించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సీడీఇఎల్ తెలిపింది. సీడీఇఎల్ సర్వసభ్య సమావేశంలో కాఫీ డే నష్టాలను నివారించడంతో పాటు మూడు ప్రముఖ నిర్ణయాల మీద చర్చ జరిగింది. వి.జి. సిద్దార్థ చివరి సారిగా కాఫీ డే కంపెనీ ఉద్యోగులకు రాశారు అంటున్న లేఖ మీద ఇదే సమావేశంలో చర్చ జరిగింది.
ఫోరెన్సిక్ నిపుణులు
లేఖలోని నిజానిజాలు తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని సీడీఇఎల్ నిర్ణయించింది. జూన్ వరకు ఆర్థిక పరిస్థితి విషయం గురించి ఆగస్టు 8వ తేదీ చర్చించాలని వి.జి. సిద్దార్థ ఉన్న సమయంలో సీడీఇఎల్ నిర్ణయం తీసుకుంది. అయితే వి.జి. సిద్దార్థ మరణించిన తరువాత ముందుగా నిర్ణయించిన అదే తేదీన సమావేశం నిర్వహించారు.
కాఫీ కింగ్ భార్య మాళవిక హెగ్డే
వి.జి. సిద్దార్థ మరణించిన తరువాత జులై 31వ తేదీన సీడీఇఎల్ అత్యవరస సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వి.జి. సిద్దార్థ సతీమణి మాళవికా హెగ్డేని సీడీఇఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమించారు. సీఇవో స్థాయి అధికారి నిర్ణయాలను వి.జి. సిద్దార్థ సతీమణి మాళవికా హెగ్డే తీసుకుంటున్నారు. సీడీఇఎల్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం సీడీఇఎల్ కు రూ. 11, 259 కోట్ల ఆస్తి ఉంది.