కాఫీ కింగ్ సిద్దార్థ ఇంటిలో మరో విషాదం, కొడుకు లేడని చివరి వరకు ఆ తండ్రికి తెలీదు!
మైసూరు/బెంగళూరు: కాఫీ కింగ్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ కుటుంబంలో మరో విషాదం. వి.జి. సిద్దార్థ తండ్రి కాఫీ తోటల యజమాని గంగయ్య హెగ్డే మృతి చెందారు. అనారోగ్యంతో మైసూరు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగయ్య హెగ్డే ఆదివారం మరణించారు. నెల రోజుల గడవక ముందే తండ్రి, కొడుకు మరణించడంతో సిద్దార్థ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
వి.జి. సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే చాల కాలంగా మైసూరు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ జులై 29వ తేదీ మరణించారు. కుమారుడు వి.జి. సిద్దార్థ మరణించిన విషయం ఆయన తండ్రి గంగయ్య హెగ్డేకి తెలీదు.
వి.జి. సిద్దార్థ మరణించిన సమయంలో గంగయ్య హెగ్డే కోమాలో ఉన్నారు. గంగయ్య హెగ్డే ప్రాణాలు విడిచే వరకూ కుమారుడు వి.జి. సిద్దార్థ మరణించిన విషయం తెలీదు. జులై 29వ తేదీ (సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్న రోజు) వి.జి. సిద్దార్థ మంగళూరు బయలుదేరిన సమయంలో మార్గం మధ్యలో మైసూరుకు వెళ్లారు.
మైసూరులోని ఆసుపత్రికి చేరుకున్న వి.జి. సిద్దార్థ ఆయన తండ్రి గంగయ్య హెగ్డే ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో తండ్రి గంగయ్య హెగ్డే పక్కన వి.జి. సిద్దార్థ కుర్చుని ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తండ్రి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్న వి.జి. సిద్దార్థ నేరుగా మంగళూరు చేరుకుని తరువాత నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వి.జి. సిద్దార్థ తండ్రి గంగయ్య వ్యవసాయం చేసేవారు. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె సమీపంలో గంగయ్య హెగ్డే వందల ఎకరాల్లో కాఫీ తొటలు పెంచారు.
గంగయ్య హెగ్డే కుమారుడు సిద్దార్థ వ్యాపారానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. మూడిగెరె ఊరి ప్రజలు గంగయ్య హెగ్డేని ప్రేమగా అయ్యా అని పిలిచేవారు. 90 ఏళ్లు దాటిన గంగయ్య ఇంతకు ముందు చేతన అనే పుస్తకం రాశారు. చేతన పుస్తకాన్ని ఎస్ఎం. కృష్ణ ఆవిష్కరించారు.