డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్, ఫ్యామిలీకి అండగా కాఫీ కింగ్, హీరో రజనీకాంత్, అదే జులై 30 తేదీ!
బెంగళూరు: కేఫ్ కాఫీ డే కింగ్ వి.జి. సిద్దార్థ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కేఫ్ కాఫీ డే సంస్థలో వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వి.జి. సిద్దార్థ నేడు మృతి చెందారని తెలుసుకున్న ఆ సంస్థ ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సిద్దార్థ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ ను నరహంతకుడు వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు సిద్దార్థ అండగా ఉన్నారు. డాక్టర్ రాజ్ కుమార్ ను విడిపించడానికి సిద్దార్థ శక్తివంచన లేకుండా కృషి చేశారు. జులై 30వ తేదీ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, సిద్దార్థ కుటుంబ సభ్యులు మరచిపోలేని రోజు అయ్యింది.
డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్
2000 జులై 30వ తేదీ కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ ను నరహంతకుడు వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో డాక్టర్ రాజ్ కుమార్ ను వీరప్పన్ చెర నుంచి విడిపించడానికి వి.జి. సిద్దార్థ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో వి.జి. సిద్దార్థ మామ ఎస్.ఎం. కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సందర్బంలో ఆయన్ను విడిపించడానికి సిద్దార్థ తమిళనాడు ప్రభుత్వం సహాయం తీసుకోవడానికి ప్రయత్నించారు.
హీరో రజనీకాంత్ సహకారం!
డాక్టర్ రాజ్ కుమార్ ను నరహంతకుడు వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైనారు. ఆ సమయంలో డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన సిద్దార్థ వారికి అండగా ఉన్నారు. డాక్టర్ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్, వారి కుమారులకు సిద్దార్థ వెన్నంటి ఉన్నారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సహాయంతో వీరప్పన్ చెర నుంచి డాక్టర్ రాజ్ కుమార్ ను విడిపించడానికి సిద్దార్థ ప్రయత్నాలు చేశారు.రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు హెలికాప్టర్ లో చెన్నై వెళ్లడానికి సిద్దార్థ దగ్గరండి ఏర్పాట్లు చేశారు.
జులై 30వ తేదీ బ్లాక్ డే
2000 జులై 30వ తేదీ డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ అయ్యారు. అదే జులై 30వ తేదీ కాఫీ కింగ్ సిద్దార్థ అదృశ్యం అయ్యారని తెలుసుకున్న రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైనారు. బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని డాక్టర్ రాజ్ కుమార్ కుమారుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, సిద్దార్థ మామ, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి. విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ కుమారులు డాక్టర్ శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే చివరికి సిద్దార్థ మృతి చెందారని తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు.
రాజ్ కుమార్ ఫ్యామిలీ సంతాపం
కాఫీ కింగ్ సిద్దార్థ మృతికి డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ట్వీట్టర్ లో సిద్దార్థ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సిద్దార్థ మృతి చెందారని తెలుసుకుని తాను షాక్ కు గురైనారని పునీత్ రాజ్ కుమార్ అన్నారు. కాఫీ సామ్రాజ్యంలో తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని పునీత్ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు.