కాఫీ డే ఓనర్ అదృశ్యానికి కొన్ని గంటల ముందు.. ఏం జరిగింది..? కారు డ్రైవర్ వాంగ్మూలం
బెంగళూరు: కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల అధిపతి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులో చూసింది. తన యజమాని మాయం కావడంపై కారు డ్రైవర్ బసవరాజ్ పాటిల్ పోలీసులకు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇందులో కొన్ని అనూహ్యమైన అంశాలు తెరమీదికి వచ్చాయి. కుటుంబ సభ్యులకు సైతం తెలియవని అంటున్నారు. సిద్ధార్థ అదృశ్యం కావడానికి కొన్ని గంటల ముందు చోటు చేసుకున్న సంఘటలపై ఆయన కారు డ్రైవర్ బసవరాజ్ పాటిల్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మంగళూరు శంకనాడి పోలీసులకు ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు. మూడేళ్లుగా ఆయన సిద్ధార్థ వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. బసవరాజ్ పాటిల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం..
Recommended Video
కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల అధిపతి ఆత్మహత్య చేసుకున్నారా? రెండురోజుల కిందటే..ఆ లేఖలో ఏం రాశారు?
బెంగళూరు టు మంగళూరు: సిద్ధార్థ చివరి ప్రయాణం?
సోమవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు విఠల్ మాల్యా రోడ్డులోని తన కార్యాలయం నుంచి కేఏ 03 ఎన్ సీ 2592 నంబర్ ఇన్నోవా కారులో సిద్దార్థ తన టీ ఎస్టేట్ కు బయలుదేరారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చిక్ మగళూరు జిల్లా సకలేశ పురాకు చేరుకుంది. నిజానికి వారి ప్రయాణం చిక్ మగళూరు వైపు సాగాల్సి ఉంది. సకలేశ పురాకు చేరుకున్న తరువాత కారును మంగళూరు వైపునకు వెళ్లాల్సిందిగా సిద్ధార్థ కారు డ్రైవర్ బసవరాజ్ పాటిల్ కు సూచించారు. మంగళూరు నగర శివార్లకు చేరుకున్న తరువాత కారును కేరళ హైవే మీదికి వెళ్లమని చెప్పారు.
వాకింగ్ చేసొస్తానని వెళ్లి..మాయం
సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత నేత్రావతి బ్రిడ్జిపై కారును ఆపాల్సిందిగా ఆదేశించారు. దీనితో పాటిల్ కారును బ్రిడ్జిపే నిలిపేశారు. తాను వాకింగ్ చేసి వస్తానని, కారులోనే ఉండాలని సిద్ధార్థ డ్రైవర్ కు సూచించారు. అప్పటికి సమయం సాయంత్రం 7 గంటలైంది. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న సిద్ధార్థను తాను చివరిసారి చూశానని డ్రైవర్ తన వాంగ్మూలంలో రాశారు. ఎనిమిది గంటలైనప్పటికీ రాకపోకవడంతో ఆయన మొబైల్ కు ఫోన్ చేశానని, అప్పటికే స్విచ్ ఆఫ్ అయిందని అన్నారు. రాత్రి 9 గంటల సమయంలో తాను సిద్ధార్థ కుమారుడు అమర్థ్ హెగ్డేకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశానని రాసుకొచ్చారు.
స్నేహితులకు సారీ చెప్పిన సిద్ధార్థ..
సకలేశ పురా నుంచి కారు మంగళూరు వైపునకు మళ్లినప్పటి నుంచీ సిద్ధార్థ తన స్నేహితులు, దగ్గరి బంధువులకు ఫోన్ చేస్తూ కనిపించారని బసవరాజ్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంలో సిద్ధార్థ ముభావంగా ఉన్నారని, క్లుప్తంగా మాట్లాడారని అన్నారు. తనను క్షమించాలని స్నేహితులందరికీ ఫోన్ చేయడాన్ని తాను విన్నానని చెప్పారు. సకలేశ పురా నుంచి మంగళూరు చేరుకునేంత వరకూ ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి విషయాలనూ మాట్లాడలేదని, కేవలం క్షమాపణలు కోరుతూ కనిపించారని చెప్పారు. ఈ విషయం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందని బసవరాజ్ పాటిల్ తెలిపారు. కొందరితో కన్నడంలో, మరి కొందరితో ఇంగ్లీష్ లో మాట్లాడారని అన్నారు. తన పర్సు, కొన్ని విలువైన వస్తువులను కారులో ఉంచి, మొబైల్ ను మాత్రం తన వెంట తీసుకెళ్లారని చెప్పారు. మొబైల్ లో మాట్లాడుతుండగా.. తాను చివరిసారి చూశానని తెలిపారు.