రాఫెల్ డీల్పై మరో షాకింగ్ - ఒప్పందానికి ముందే లోపాలు చెప్పిన కాగ్- అయినా కేంద్రం ముందుకే..
ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏపియేషన్ సంస్ధ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ జెట్ విమానాల డీల్ విషయంలో రోజుకో సంచలన విషయం బయటికొస్తూనే ఉంది. పార్లమెంటుకు కాగ్ తాజాగా సమర్పించిన నివేదికలో రాఫెల్ డీల్కు ముందు కేంద్రం రక్షణ విధానంలో తీసుకొచ్చిన మార్పులు, వాటిని రాఫెల్ డీల్కు వర్తింపజేయని వైనాన్ని మరోసారి ఎండగట్టింది. దీంతో రాఫెల్ డీల్ విషయంలో కేంద్రం చెబుతున్న విషయాలన్నీ అబద్దాలే అని మరోసారి తేలినట్లయింది. హడావిడిగా రాఫెల్ జెట్లను కొనుగోలు చేయాలన్న కేంద్రం ఆతృతను కాగ్ తాజాగా సమర్పించిన నివేదిక స్పష్టంగా వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇది మరో కలకలానికి కారణమవుతోంది.
Recommended Video
అక్రమాల పుట్టగా రాఫెల్ డీల్...
ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్తో పాటు యూరోపియన్ సంస్ధ ఎంబీడీఏ సంయుక్తంగా 126 రాఫెల్ విమానాలను భారత్కు అమ్మేందుకు గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో 36 విమానాలను నేరుగానూ, మిగతా వాటిని భారత్కు చెందిన హిందుస్ధాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ద్వారా డీఆర్డీవో ఉత్పత్తి చేసేందుకు సహకరించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ తాము అమ్మాల్సిన విమానాలు అమ్మేసి మిగతా వాటి విషయంలో డీఆర్డీవోతో టెక్నాలజీ పంచుకునే విషయంలో ఇప్పటికే డసాల్ట్ మౌనంగా ఉండిపోతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. దీనిపై ఓవైపు రచ్చ సాగుతుండగానే అసలు ఈ డీల్లో మరిన్ని లోపాలున్నాయని కాగ్ అదే నివేదికలో బయటపెట్టింది.
ఆఫ్సెట్ నిబంధనల మార్పుతో డసాల్ట్ వెనక్కి...
2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రక్షణ విధానంలో 2015లో ఎన్డీయే సర్కారు మార్పులు చేసింది. వీటి ప్రకారం అప్పటివరకూ భారత్కు రక్షణ పరికరాలు అమ్మే విదేశీ సంస్ధలు డీల్లో 30 శాతం మొత్తం మాత్రమే డీఆర్డీవోలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉండగా.. మోడీ సర్కారు దాన్ని 50 శాతానికి పెంచింది. దీంతో పాటు కమర్షియల్ నిబంధనల్లోనూ పలు మార్పులు చేసింది. వీటి ప్రకారం రాఫెల్ ఒప్పందానికి కూడా ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. కానీ రాఫెల్ విక్రేత అయిన డసాల్ట్ దీనికి ఒప్పుకోలేదు. భారత్లో 50 శాతం మొత్తం పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడని డసాల్ట్ డీల్పై మౌనంగా ఉండిపోయింది. దీంతో డసాల్ట్ను బుజ్జగించేందుకు కేంద్రం మరోసారి రంగంలోకి దిగింది.
రాఫెల్ కోసం రూల్స్ పక్కనబెట్టిన మోడీ సర్కార్...
ఎప్పుడైతే డసాల్ట్ సంస్ధ రాఫెల్ డీల్లో భాగంగా 50 శాతం మొత్తాన్ని రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించలేదో అప్పుడు మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడింది. దీంతో 50 శాతం నిబంధనతో పాటు తమ ఆఫ్సెట్ భాగస్వామి ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ రాఫెల్ డీల్ లో పేర్కొంటూ ఒప్పందం పూర్తి చేసుకుంది. దీంతో డసాల్ట్ సంస్ధ ఇప్పుడు ఒప్పందం ప్రకారం రాఫెల్ జెట్లను భారత్కు పంపుతోంది. ఇప్పటికే ఐదు జెట్లు భారత్కు రాగా.. మిగగతావి కూడా దశల వారీగా భారత్కు రావాల్సి ఉంది. అయితే టెక్నాలజీని భారత్ని ఆఫ్సెట్ భాగస్వామి అయిన డీఆర్డీవోతో పంచుకునే విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు.
ముందే హెచ్చరించిన కాగ్..
ఈ మొత్తం వ్యవహారంలో రక్షణశాఖ ఆఫ్సెట్ నిబంధనలను రాఫెల్ డీల్కు వర్తింపజేయాల్సిందేనని కాగ్ ఈ ఒప్పందానికి ముందే కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. అయితే రాఫెల్ విక్రేత డసాల్ట్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందున ఆఫ్సెట్ నిబంధనలను ప్రత్యేకంగా ఒప్పందంలో ప్రస్తావించాల్సిన అవసరం లేదని రక్షణ శాఖ తెలిపింది. కానీ అలా కుదరని, ఒప్పందంలో ఆఫ్సెట్ రూల్స్ పెట్టకపోతే సమస్యలు తప్పవని కాగ్ హెచ్చరించింది. అయినా లెక్కచేయకుండా కేంద్రం రాఫెల్ డీల్పై ముందుకెళ్లింది. కానీ ఇప్పుడు డీఆర్డీవోతో టెక్నాలజీ పంచుకోవడంతో పాటు మరిన్ని అంశాల్లో ఆఫ్సెట్ నిబంధనల అమలు కాలేదంటూ కాగ్ పార్లమెంటుకు ఇచ్చిన నివేదికతో కలకలం రేగుతోంది. అటు రాఫెల్ డీల్లో చెప్పని ఆఫ్సెట్ రూల్స్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న డసాల్ట్ ... టెక్నాలజీ భాగస్వామ్యంపై నోరు మెదపడం లేదని తెలుస్తోంది. దీంతో కేంద్రం ఏకంగా ఆఫ్సెట్ రూల్స్నే మార్చేసి డసాల్ట్కు మేలు చేసేలా నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.