జంతువుల కన్నా హీనంగా బంధించారు: హోం మంత్రికి మాజీ సీఎం కుమార్తె వాయిస్ మెసేజ్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలువురు ప్రతిపక్ష నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర నాయకులు ఇప్పటికీ గృహ నిర్బంధంలోనే ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం వారిని విముక్తులను చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందినప్పటికీ.. దీనికి భిన్నమైన పరిస్థితులు కాశ్మీర్ లోయలో నెలకొని ఉన్నాయి. భారతీయ జనతాపార్టీ మినహా మరే రాజకీయ నాయకుడు కూడా స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో నెలకొని ఉందని వార్తలు వస్తున్నాయి.
తమను జంతువుల కంటే హీనంగా బంధించారని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావేద్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తాను మీడియాతో మాట్లాడితే భయంకర పరిణామాలు ఎదురవుతాయని బెదిరింపులు వస్తున్నాయని భయాందోళనలను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వాయిస్ మెసేజ్ ను ఆమె విడుదల చేశారు. దీనితో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఓ లేఖను కూడా రాశారు. దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటే.. తాము మాత్రం జంతువుల కన్నా హీనంగా నిర్బంధనకు గురయ్యామని చెప్పారు. కాశ్మీరీలను జంతువుల్లా బంధించారని, మావన హక్కులను అణచివేశారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
తనను అక్రమంగా ఎందుకు నిర్బంధించారని ప్రశ్నిస్తే మీడియాతో మాట్లాడుతున్నందున నిర్బంధించామని భద్రతా సిబ్బంది చెబుతున్నారని ఆమె ఆరోపించారు. మరొకసారి మీడియాతో మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భద్రతా బలగాలు తనను హెచ్చరిస్తున్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఇలా ఇంకెన్నాళ్లు తమను నిర్బంధంలో ఉంచుతారని ఇల్తిజా జావేద్ ముఫ్తి నిలదీశారు. భద్రతా బలగాలు తమను నేరస్తులుగా చూస్తున్నాయని, సొంత ఇళ్లు కారాగారవాసంలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ ను అఖండ భారతావనిలో విలీనం చేయడమంటే ఇదేనా? ఆమె ప్రశ్నిస్తున్నారు. తమను గృహ నిర్బంధంలో ఉంచి రెండు వారాలు దాటినప్పటికీ.. శాంతిభద్రతల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు.