దేశం విడిచి వెళ్లాలనే నోటీసుపై కోల్కతా హైకోర్టు స్టే, వార్త కథనం ఆధారంగా చర్యలంటోన్న విద్యార్థి..
పౌరసత్వ సవరణ చట్టం రగడ కొనసాగుతూనే ఉంది. జాదవ్పూర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. దీనిని కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే 'రీజనల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం' సీరియస్గా తీసుకుంది. సదరు విద్యార్ధి ఫిబ్రవరి 14వ తేదీన దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విద్యార్థి కోల్ కతా కోర్టును ఆశ్రయించగా గురువారం జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఆదేశాలపై స్టే..
దేశం విడిచి వెళ్లిపోవాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై కోల్ కతా హై కోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై మార్చి 18వ తేదీ వరకు స్టే ఉంటుందని పేర్కొన్నది. జాదవ్పూర్ వర్సిటీలో గల ‘కంపారేటివ్ లిటరేచర్' విభాగంలో విద్యార్థిని కామిల్ సిడ్సిన్స్కి పీజీ చేస్తున్నారు. విదేశీ విద్యార్థిని ఆందోళనను హోంశాఖ సీరియస్గా తీసుకున్నది. ఆమె ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందక.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీచేసింది.
విద్యార్థులతో కలిసి.
గతేడాది డిసెంబర్ 19వ తేదీన తాను కావాలని సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనలేదని విద్యార్థిని పేర్కొన్నారు. తమ కాలేజీకి చెందిన విద్యార్థులు, టీచర్లు పాల్గొనడంతో వెళ్లానని గుర్తుచేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారని.. విద్యార్థులు పాటలు పాడరని గుర్తుచేశారు. వారితో కొద్దిసేపు తాను నడిచానని.. కొందరు పోస్టర్ పట్టుకొని నినాదాలు చేయమని కోరగా.. తాను అందుకు నిరాకరించానని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఒంటరిగా ఉన్నానని.. ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నానని చెప్పారు. మిగతా ఇద్దరు విదేశీయుల లాగానే తాను నడుచుకొన్నానని చెప్పారు.
రిపోర్టర్తో చిట్ చాట్..
కానీ దురదృష్టవశాత్తు మీడియా ప్రతినిధి తనపై ప్రశ్నలు సంధించారని.. అందుకు రియాక్ట్ అవడమే తన తప్పయిపోయిందని వివరించారు. మీరు ఎవరూ..? ఎక్కడినుంచి వచ్చారు..? విద్యార్థా..? మీ పేరు ఏంటీ అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇచ్చానని.. కానీ దానికి ఆ ప్రతినిధి చెప్పనిది చెప్పినట్టు రాశారని పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఉన్నానని ఉద్దేశంతో వచ్చేలా వార్త రాశారని పేర్కొన్నారు. కానీ తాను అలా వ్యవహరించలేదని గుర్తుచేశారు. ఓ విదేశీయుడు భారత పార్లమెంట్ చట్టాన్ని సవాల్ చేయలేడు అని కేంద్ర ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది.