పశ్చిమ బెంగాల్ శారదా స్కాం: సీబీఐని అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పారు
న్యూఢిల్లీ: శారదా చిట్స్ కుంభకోణంలో విచారణను అడ్డుకున్నందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలరు కే డే, డీజీపీ వీరేంద్ర కుమార్, కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ అత్యున్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు, వేరువేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు.
కాగా, వీరు ఈ నెల 20లోగా సుప్రీం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు అయిన తర్వాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. శారద కుంభకోణం కేసులో విచారణలో భాగంగా ఈ నెల మూడో తేదిన కోల్కతా వెళ్లిన సీబీఐ అధికారులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగారు. సీబీఐ అధికారులను నిర్బంధించారు. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా సోమవారం పశ్చిమ బెంగాల్ అధికారులు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో పాటు అఫిడవిట్లు దాఖలు చేశారు.
అధికార ధిక్కారానికి పాల్పడే ఉద్దేశం లేదని సుప్రీం కోర్టుకు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతోనే సీబీఐ అధికారులను అడ్డుకున్నామని తెలిపారు.