'కుక్క అని పిలిచినా భరిస్తా.. పాకీస్తానీ అనొద్దు'
న్యూఢిల్లీ : పాక్ ఆగడాలు బలూచిస్థాన్ ప్రజలను ఎంతగా వేధించుకు తింటున్నాయో తెలియజెప్పే ఘటన ఇది. న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఓ బలూచిస్థాన్ వాసిని.. ఇమ్మిగ్రేషన్ అధికారులు పాకిస్తానీగా అనుమానించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన అతను ' నన్ను కుక్క అనైనా పిలవండి.. కానీ పాకిస్తానీ అనవద్దని' అధికారులతో చెప్పినట్లుగా' సమాచారం.
బలూచిస్థాన్ కు చెందిన మజ్దక్ దిల్షాద్ అనే 25 ఏళ్ల యువకుడు తన భార్యతో కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాడు. కాగా, అతని పాస్ పోర్టు వివరాలను పరిశీలించిన అధికారులకు అతను పుట్టింది పాకిస్తాన్ లోని క్వెట్టా అన్న విషయం తెలిసింది. దీంతో విషయంపై అధికారులు ఆరా తీయగా.. తనను కుక్క అన్న భరిస్తాను గానీ పాకిస్తానీ అనవద్దని ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాక్ జాతీయతను ఒప్పుకునేందుకు బలూచిస్థాన్ ప్రజలను పాక్ తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపాడు. పాక్ వేధింపులు తాళలేక ఇప్పటికే చాలామంది బలూచిస్థాన్ ప్రజలు విదేశాలకు వెళ్లిపోయారని చెప్పాడు. బలూచిస్థాన్ వాసులను పాక్ ఆర్మీ చిత్రహింసలు పెడుతోందని వివరించారు. ఇదిలా ఉంటే.. పాక్ సైన్యం చేతుల్లో మజ్దక్ తండ్రి హత్య చేయబడ్డారు. తల్లిని కూడా వేధింపులకు గురిచేయడంతో.. వేధింపులు తాళలేక కెనడాకు వెళ్లిపోయాడు మజ్దక్.
కాగా, బలూచిస్థాన్ లో స్వాతంత్ర్యం కోసం జరుగుతోన్న పోరాటం నేపథ్యంలో.. తాను కెనడా నుంచి న్యూఢిల్లీ చేరుకున్నట్లుగా తెలియజేశాడు మజ్దక్. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోను, బలూచిస్థాన్ లోను పాక్ చేస్తోన్న ఆగడాలపై మాట్లాడినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపాడు మజ్దక్. తాను పుట్టిన దేశంలో జాతుల నిర్మూలన కోసం పాక్ ఆర్మీ తెగబడుతోందన్నాడు మజ్దక్.