సీఎం బెర్త్ ఇస్తానంటే పిలువండి.. లేదంటే లేదు, బీజేపీకి ఉద్దవ్ అల్టిమేటం..
మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ ప్రధాన భాగస్వామ్య పక్షం శివసేన సీఎం బెర్త్ అడగడంతో మహా పీఠముడి నెలకొంది. దీనిపై చర్చొపచర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్దవ్ మరోసారి బీజేపీ అల్టిమేటం ఇచ్చారు. సీఎం పోస్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే పిలువాలే తప్ప లేదంటే పిలువొద్దని తేల్చిచెప్పారు.
35 ఏళ్ల బంధం..
బీజేపీ-శివసేన బంధం 35 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. 2014 మహారాష్ట్ర ఎన్నికల సమయంలో విడివిడిగా పోటీచేశాయి తప్ప.. మిగతా సందర్భాల్లో కలిసి బరిలోకి దిగాయి. ఈ క్రమంలో ఉద్దవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కూటమిని విచ్చిన్నం చేసే ఉద్దేశం లేదని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ఇదివరకు ఇచ్చిన మాటను విస్మరిస్తుందని ఎమ్మెల్యేలతో ఉద్దవ్ ప్రస్తావించారు. దీంతో సీఎం పోస్టుపై ఉద్దవ్ పట్టువీడటం లేదని స్పష్టంగా అర్థమవుతుంది.
వీడని ఉత్కంఠ..
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 14 రోజులు అవుతున్నా.. ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. బీజేపీ-శివసేన కూటమి మధ్య చర్చలు ఫలప్రదంగా జరగడం లేదు. మధ్యలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై హీట్ పుట్టించారు. చివరికి కాంగ్రెస్-ఎన్సీపీ దూరంగా ఉండటంతో.. బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమేనని అనిపిస్తోంది. కానీ ముఖ్యమంత్రి కుర్చీపై మాత్రం వారి మధ్య స్పష్టత రాలేదు.
మాటిచ్చి..
గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తమకు మాటిచ్చిందని ఉద్దవ్ గుర్తుచేశారు. ఇరుపార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపింది. కానీ ఇప్పుడు మాట తప్పుతుందని గుర్తుచేశారు. అప్పుడు మాటిచ్చి.. ఇప్పుడు ఇలా చేయడం సరికాదంటున్నారు. ఇదే అంశాన్ని బీజేపీ పెద్దలకు తాను వివరించినట్టు గుర్తుచేశారు. కానీ వారు ఆ మాటను విస్మరించడంతో చర్చలు జరిపేందుకు దూరంగా ఉంటున్నామని ఉద్దవ్ క్లారిటీ ఇచ్చారు. తమకు రెండున్నరేళ్లు సీఎం పదవీ ఇస్తానని చెబితే ఓకే.. లేదంటే చర్చల ప్రసక్తే లేదని ఉద్దవ్ తేల్చిచెప్పారు.
ఆత్మగౌరవం కోసమే..
తమ పార్టీ ఆత్మ గౌరవం కోసం ఆవిర్భవించిందని ఉద్దవ్ గుర్తుచేశారు. ఈ విషయంలో తాము బీజేపీని తప్పుపట్టబోమని చెప్పారు. కానీ ఫడ్నవీస్ ప్రకటన అందుకు విరుద్ధంగా ఉంటుందని చెప్పారు. అతను అబద్దం చెప్తున్నారనే అంశం ప్రకటనతోనే తేలిపోయిందన్నారు. తన మాటలకు బీజేపీ కట్టుబడకపోయి ఉంటే.. ఆ పార్టీ నేతలతో చర్చలు ఎందుకు అని ఉద్దవ్ ప్రశ్నించారు.