మీతో మాట్లాడతారట: దావూద్ మనిషినంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఫోన్
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనిషిని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడం కలకలం రేపింది. బాంద్రాలోని ఉద్ధవ్ వ్యక్తిగత నివాసమైన మాతోశ్రీకి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రెండుసార్లు ఈ ఫోన్ వచ్చింది.
Recommended Video
ఈ క్రమంలో మాతోశ్రీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దుబాయ్ నుంచి దావూద్ తరపున మాట్లాడుతున్నానని.. ఉద్ధవ్తో దావూద్ ఇబ్రహీం మాట్లాడాలని అనుకుంటున్నారన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం కావడం గమనార్హం. అయితే, ఆ ఫోన్ ఎత్తిన వ్యక్తి మాత్రం సీఎం ఉద్ధవ్కు ఇవ్వేలేదు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, కేసు నమోదు చేయలేదు.
ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. నిజంగానే దుబాయ్ నుంచి ఫోన్ వచ్చిందా? లేదా ఇంకేదైనా ప్రాంతం నుంచి చేశారా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ కాల్లో అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదు.
ఈ ఘటనను ధృవీకరించిన ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. బాంద్రాలోని మాతోశ్రీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఇక ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ మాట్లాడుతూ.. శివసైనికులే మాతోశ్రీని కాపాడుకుంటారని, ఎవరూ కూడా ఉద్ధవ్ను తాకలేరని వ్యాఖ్యానించారు.