లోక్పాల్కు లోకసభ ఆమోదం, ములాయం వాకౌట్
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆమోదం పొందిన లోక్పాల్ బిల్లు బుధవారం మధ్యాహ్నం లోకసభలో కూడా ఆమోదం పొందింది. బిజెపి సూచించిన సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో బిజెపి సహా పలు పార్టీలు లోక్పాల్కు మద్దతిచ్చాయి. అంతకుముందు లోక్పాల్ బిల్లును పునఃపరిశీలించి ఆమోదిద్దామని, సభకు అధికార పార్టీ సభ్యులే అడ్డుపడుతున్నారని బిజెపి ఎంపి సుష్మా స్వరాజ్ సూచించారు. లోక్పాల్ బిల్లును ఈ రోజు లోకసభలో ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా సుష్మా మాట్లాడారు. లోక్పాల్ బిల్లును పునఃపరిశీలించి ఆమోదిద్దామన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని, అధికారపక్ష సభ్యుల తీరుతో సభ సజావుగా సాగడం లేదన్నారు. సభలో ప్రశాంత పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లోక్పాల్ బిల్లును పాస్ చేసేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఈ బిల్లు కీలకమైందన్నారు. సమావేశాలు పొడిగించి అయినా సరే బిల్లును ఆమోదిద్దామని, అన్ని పార్టీలు దీనికి సహకరించాలని కోరారు. లోక్పాల్తో చరిత్ర నెలకొల్పుతామన్నారు. ప్రధాని పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలని, ప్రధానిని లోక్పాల్ పరిధిలోకి తేవడం మంచిది కాదని శరద్ యాదవ్ అన్నారు.
సభలో లోక్పాల్ బిల్లును సమాజ్వాది పార్టీ పార్లమెంటు సభ్యులు ములాయం సింగ్ యాదవ్ వ్యతిరేకించారు. ఈ బిల్లు అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఈ బిల్లు చట్టం అయితే దేశంలో ఏ అధికారి పని చేయలేడన్నారు. బిల్లు కోసం కాంగ్రెసు, బిజెపిలో తొందరపడుతున్నాయన్నారు. లోక్పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్పీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.
దీక్ష విరమించిన అన్నా
లోక్పాల్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిల్లును ఆమోదించినందుకు సంతోషంగా ఉందని, సెలక్ట్ కమిటీకి, ఆమోదించిన పార్టీలకు ధన్యవాదాలు అన్నారు. రెండేళ్లుగా తాను ఈ బిల్లు కోసం పోరాడుతున్నానని, ప్రజలందరు బలమైన లోక్పాల్ కోరుకుంటున్నారన్నారు. బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసి అన్నా హజారే దీక్షా శిబిరం వద్ద సంబరాలు చేసుకున్నారు.