దొంగను దొంగ అంటే పరువు నష్టం కాదు: సిబిఐ కోర్టు
న్యూఢిల్లీ: దొంగను దొంగ అంటే అతని పరువుకు నష్టం కలిగించినట్లుగా భావించనక్కర్లేదని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. భూషణ్ స్టీల్స్ కంపెనీ పన్ను ఎగవేతకు పాల్పడిందని పేర్కొంటూ జై కిషన్ బన్సల్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాశారు.
దీంతో ఆ కంపెనీ అతనిపై అక్కసుతో ఆయనపై ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ బన్సల్ సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారించిన సిబిఐ న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ జారీ అయిన సమన్లను కొట్టివేశారు. ‘ప్రజావేగు సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారు. దొంగను దొంగ అంటే ఆ వ్యక్తికి పరువు నష్టంగా భావించరాదు. పన్ను ఎగవేత యూనిట్ అన్నంత మాత్రాన అపఖ్యాతి పాల్జేశారని భావించనక్కర్లేదు' అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరాలే అయినప్పటికీ కొన్నిసార్లు, లంచం ఇచ్చే వారిని చట్టం బాధితుడిగా పరిగణిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, సదరు కంపెనీ కోట్లలో పన్ను ఎగవేతకు పాల్పడుతోందని పిటిషనర్ జై కిషన్ బన్సల్ తెలిపారు.