నిజమేనా?, ఆ డీల్ జరిగిందా..: 'కాంగ్రెస్'పై జాతీయ మీడియా బాంబు..
Recommended Video
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా స్కామ్ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాను సైతం ప్రభావితం చేసే రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్టు దాని ద్వారా వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఈ స్కామ్ ప్రభావితం చేసిందన్న ఆరోపణలతో ఫేస్బుక్ తన విశ్వసనీయతను కొంతవరకు కోల్పోయింది.
ఇలాంటి తరుణంలో ఇండియాలోనూ అలాంటి స్కామ్ కు స్కెచ్ గీశారని, ఇందుకోసం ఒప్పందం కూడా జరిగిందని జాతీయ మీడియా ఎన్డీటీవి బాంబు పేల్చింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఈ ఉదంతానికి తెరలేపినట్టు చెప్పింది. ఇందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కేంబ్రిడ్జి అనలిటికా టీమ్ మంతనాలు కూడా జరిపిందని చెప్పడం గమనార్హం.
రూ.2.5కోట్లతో ఒప్పందం?
బ్రిటన్కు చెందిన కేంబ్రిడ్జి ఎనలిటికా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరేలా ఫేస్బుక్ ను ప్రభావితం చేసేందుకు ఆ పార్టీతో సంప్రదించిందని ఎన్డీటివి తెలిపింది. ఇందుకోసం రూ.2.5కోట్లతో ఒప్పందం కూడా జరిగిందని సంచలన విషయం బయటపెట్టింది.
మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. కేంబ్రిడ్జి అనలిటికా సభ్యులు పార్టీని సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే ఓ వాణిజ్య ప్రతిపాదనను వారు మా ముందు ఉంచినంత మాత్రాన ఒప్పందం జరిగిపోయిందనడం సరికాదని కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ విభాగ అధిపతి ప్రవీణ్ చక్రవర్తి స్పష్టం చేశారు.
పత్రాలు కూడా బయటపెట్టింది..
కాంగ్రెస్ నేతలు ఎన్టీడీవి ఆరోపణలను తోసిపుచ్చుతున్నప్పటికీ.. కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు తమకు చిక్కాయని ఆ మీడియా చెబుతోంది. దాదాపు 50పత్రాలతో కూడిన ఆ ఒప్పందం అగస్టు,2017లో జరిగినట్టు అందులో పొందుపరిచారని పేర్కొంది. దీనికి 'సమాచార సేకరణ క్యాంపెయిన్-2019 లోక్ సభ ఎన్నికలకు మార్గం' అని నామకరణం కూడా చేసినట్టు తెలిపింది.
డీల్ ఉద్దేశం..
కాంగ్రెస్ పార్టీతో ఒప్పందంలో భాగంగా ఫేస్ బుక్ పోస్టులు, ట్వీట్లను విశ్లేషించి ఓటర్లను పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసేందుకు ఒప్పందం జరిగినట్టు ఎన్డీటివి వెల్లడించింది. ఇందుకు గాను 389,460 యూఎస్ డాలర్ల(రూ.2.5కోట్లు) ఒప్పందం జరిగినట్టు తెలిపింది. నిజానికి ఈ ఒప్పందం విలువ రూ.7.5కోట్ల వరకు ఉండవచ్చునన్న సమాచారం కూడా అందుతోందని చెప్పడం గమనార్హం.
ఓటర్ల మనోగతాన్ని తెలుసుకోవడం ద్వారా వారికి పార్టీకి అనుకూలంగా మలిచే క్యాంపెయినింగ్ చేయవచ్చనేది ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశంగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ తిరస్కరించిందా?:
కేంబ్రిడ్జి అనలిటికా ప్రతిపాదనలను తాము తిరస్కరించినట్టు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కేంబ్రిడ్జి అనలిటికాకి 'రైట్ వింగ్' అన్న ముద్రపడ ఉండటంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కూడా అవకాశం ఉందని వారు భావించినట్టు సమాచారం.
కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్, జైరాం రమేశ్, పి చిదంబరంలతో కేంబ్రిడ్జి అనలిటికా సంప్రదింపులపై ఎన్డీటీవి వారి స్పందన కోరేందుకు ప్రయత్నించగా నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది.