కరోనా : లాక్డౌన్పై మరో సంచలన రిపోర్ట్.. పొడగించకుంటే పెను ప్రమాదమే..
ప్రధాని నరేంద్ర మోదీ జనతాకర్ఫ్యూకు పిలుపునిచ్చిన రోజు(మార్చి 22న) మనదేశంలో కరొనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 403. అదే నెల 23న రాత్రి ఆయన లాక్ డౌన్ ప్రకటన చేసే సమయానికి కేసుల సంఖ్య 497గా ఉంది. ఇవాళ(సోమవారం) లాక్ డౌన్ 13వ రోజు. ఈ గ్యాప్ లో కొవిడ్-19 కేసుల సంఖ్య 4500కు చేరువైంది. మృతుల సంఖ్య 120 దాటింది. ఈనెల 14తో ప్రధాని ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ముగుస్తుంది. గత వారం రోజులుగా రోజుకు కనీసం 500కు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొగడింపు లేదా ఎత్తివేతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
Recommended Video
అన్నీ ప్రముఖ సంస్థలే..
లాక్ డౌన్ కు సంబంధించి ప్రముఖ దేశీ, విదేశీ సంస్థలు కొన్ని లోతైన అధ్యయనాలు చేస్తున్నాయి. రెండ్రోజుల కిందటే అమెరికాకు చెందిన ‘బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)' తన స్టడీ రిపోర్టును విడుదల చేసింది. గరిష్టంగా సెప్టెంబర్ రెండో వారం దాకా లాక్ డౌన్ కొనసాగొచ్చని, ఇండియాలో వైద్య రంగం సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని తామీ అధ్యయనం చేశామని బీసీజీ తెలిపింది. ఇప్పుడు మరో ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ తాజాగా లాక్ డౌన్ లెక్కల్ని విడుదల చేసింది. కనీసం 49 రోజుల నిర్బంధం ఉంటేగానీ వైరస్ ముప్పునుంచి భారత్ తప్పించుకోలేదని కేంబ్రిడ్జి అంచనా వేసింది.
ఇండియా ముందు 4 ఆప్షన్లు..
కేంబ్రిడ్జి వర్సిటీ రీసెర్చర్లయిన ఆర్. అధికారి, రాజేశ్ సింగ్ లు సంయుక్తంగా ఇండియాలో లాక్ డౌన్ గురించి స్టడీ చేశారు. వాళ్లిద్దరరూ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియరిటికల్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కు చెందినవాళ్లు. లాక్ డౌన్ కు ముందు, ఆ తర్వాత కేసుల సంఖ్యలో పెరుగుదల, క్వారంటైనీల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకుని తమకున్న గణితశాస్త్ర పరిజ్ఞానంతో లెక్కలు కట్టామని వాళ్లు చెప్పారు. ఆ లెక్కల ప్రకారం వైరస్ నియంత్రణకు నాలుగు రకాల ప్రొటోకాల్స్ గుర్తించామని చెప్పారు.
21 రోజులకే ముగిస్తే..
భారతప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ద్వారా వైరస్ వ్యాప్తి రేటు చాలా వరకు తగ్గించింది. కానీ కరోనా పునుజ్జీవనాన్ని మాత్రం ఈ గడువు నివారించలేదు. అంటే, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత వైరస్ తిరిగి పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని రీసెర్చర్లు చెప్పారు. ఇక రెండో సినారియోకు వస్తే.. 49 రోజుల లాక్ డౌన్ ను రెండు దఫాలుగా అమలు చేయడం. అంటే, 21 రోజులకు లాక్ డౌన్ ఎత్తేసి.. మధ్యలో 5 రోజులు గడువిచ్చి.. మళ్లీ 28 రోజుల లాక్ డౌన్ విధించడం. ఇలా చేసినప్పటికీ వైరస్ వ్యాప్తిని నివారించలేమట.
అదొక్కడే పరిష్కారం..
రాజేశ్ సింగ్, అధికారి రీసెర్చ్ లో మూడో అంశంగా 67 రోజుల నిషేధాన్ని పేర్కొన్నారు. దాన్ని మూడు దఫాలుగా.. అంటే, 21 రోజుల తర్వాత ఐదురోజులు గ్యాపిచ్చి 28 రోజులు, తర్వాత మరో ఐదు రోజుల విరామమిచ్చి, చివరిగా 18 రోజులు లాక్ డౌన్ కొనసాగించడమన్నమాట. అలా చేస్తే ఇన్ఫెక్షన్ల రేటు గణనీయంగా తగ్గిపోతుంది. స్పష్టమైన కాంటాక్ట్స్ ను ట్రేస్ చేయగలిగితే వైరస్ తిరిగి పుంజుకోనీయకుండా చేయొచ్చు. కానీ ఈ మూడు పద్ధతుల కంటే ఏకబిగిన 49 రోజుల లాక్ డౌన్ కొనసాగింపే సమస్యకు నిజమైన పరిష్కారమవుతుందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. మూడు వారాలకే(21రోజులకే) లాక్ డౌన్ ఎత్తేసేకంటే, దాన్ని మరో నాలుగు వారాలు(మొత్తం 49 రోజులకు) పొడిగిస్తే, వైరస్ వ్యాప్తితోపాటు మరణాల రేటు కూడా తగ్గిపోతుందని వారు అంచనా వేశారు.
ప్రభుత్వం ఏం చెయ్యబోతున్నది?
లాక్ డౌన్ కు సంబంధించి వస్తున్న వార్తలన్నింటినీ కేంద్రం కొట్టిపారేస్తున్నది. తాము అధికారికంగా వెల్లడించేదే అసలైన సమాచారంగా భావించాలని ప్రజలకు సూచించింది. అయితే కేంద్రం స్పష్టత ఇవ్వకముందే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ పొడగింపునకు అధికార ఉత్తుర్వులు జారీచేయడం గమనార్హం. ఢిల్లీని ఆనుకుని ఉండే నోయిడాలో ఈనెల 30 వరకు లాక్ డౌన్, సెక్షన్ 144 అమలవుతుందని జిల్లా అధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు, మరణాల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా లాక్ డౌన్ పొడగింపు అనివార్యమేనని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా లాక్ డౌన్ కొనసాగింపు కరెక్టే అయినా, రోజుల తరబడి వ్యవస్థలు పనిచేయకపోతే అది మరింత సంక్లిష్టస్థితికి దారితీసే అవకాశాలున్నాయి. అందుకే మోదీ సర్కార్ దీనిపై ఆచితూచి, అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నది.
మళ్లీ పెరిగిన కేసులు..
సోమవారం మధ్యాహ్నానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4362గా ఉంది. ఇప్పటిదాకా 121 మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 781 మందికి వైరస్ సోకగా, తమిళనాడు, ఢిల్లీల్లో కేసుల సంఖ్య 500 దాటింది. 334 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో 266 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 13 లక్షలకు పెరగ్గా, మరణాలు 70 వేలకు చేరువయ్యాయి. అదేసమయంలో వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 2.65 లక్షలుగా ఉంది.