12రోజుల క్రితమే భారత్ వచ్చా:పాక్ ఉగ్రవాది(వీడియో)
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ప్రాణాలతో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ నోరు విప్పాడు. ఇక్కడ దాడి చేయడానికి 12 రోజుల క్రితమే పాకిస్థాన్ నుంచి భారత్ చేరుకున్నానని నవ్వుతూ తెలిపాడు.
ప్రాథమిక విచారణలో ఉస్మాన్ను జైష్ఈమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యుడిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అతడు చెప్పిన విషయాల్ని సైతం వెల్లడించారు. భారత్కి ఎలా వచ్చారని పోలీసులు అడిగిన ప్రశ్నలకుగాను ఉస్మాన్ ఇలా సమాధానం ఇచ్చాడు.
'పాక్ నుంచి 12 రోజుల క్రితమే ఇద్దరం ఇక్కడికి చేరుకున్నాం. అడవుల గుండా ప్రయాణించి భారత్లో ప్రవేశించాం. మేము కూడా తెచ్చుకున్న ఆహార పదార్థాలు మూడు రోజుల వరకు సరిపోయాయి. ఆ తర్వాత ఓ ఇంట్లో చొరబడి ఆహారాన్ని దొంగిలించాం' అని తెలిపాడు.అంతేగాక, అల్లా అప్పగించిన పని చేస్తున్నానని తెలిపాడు. కాల్పులకు పాల్పడి ఇద్దరు జవాన్ల ప్రాణాలు తీసిన ఈ రెండో కసబ్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా మీడియాతో నవ్వుతూ మాట్లాడాడు.
బుధవారం జమ్మూకాశ్మీర్లోని ఉదంపూర్లో బిఎస్ఎఫ్ జవాన్లపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో వారి మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మరణించడగా, ఉస్మాన్ అనే ఉగ్రవాది ప్రాణాలతో భద్రతాదళాలకు చిక్కాడు.
ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా, ఉస్మాన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించిన పోలీసులు, అనంతరం అతడ్ని విచారించడం ప్రారంభించారు.