ఆరోవిడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. 7 రాష్ట్రాల్లోని 59స్థానాలకు ఎల్లుండి పోలింగ్..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడత పోలింగ్కు ప్రచారం ముగిసింది. 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. చివరి రోజు అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని ఓటర్లతో మమేకమయ్యారు. ఆరో దశ ప్రచారం ముగియడంతో ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే రాహుల్ బాధ్యుడే : ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలనం
చివరి రోజు జోరుగా ప్రచారం
ఆరో దశ పోలింగ్ చివరి రోజు ప్రచారంలో పలువురు స్టార్ కాంపెయినర్లు ఓటర్లతో మమేకమయ్యారు. వివిధ ప్రాంతాల్లో బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ హర్యానాలోని రోహ్తక్తో పాటు హిమాచల్ప్రదేశ్లోని మండి, పంజాబ్లోని హోషియార్పూర్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా హర్యానాలోని బర్వాలా, హిస్సార్, చర్కీ దాద్రీల్లో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిమాచల్, ఛండీగఢ్లో జరిగిన ర్యాలీల్లో పాల్గొనగా.. పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఉత్తర్ప్రదేశ్లో పర్యటించారు.
7 రాష్ట్రాలు, 59 నియోజకవర్గాలు
ఈ దఫా ఎన్నికల్లో 7రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తర్ప్రదేశ్లో 14, హర్యానాలో 10, బెంగాల్లో 8, బీహార్లో 8, మధ్య ప్రదేశ్లలో 8, ఢిల్లీలో 7, జార్ఖండ్లో 4 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఆరో దశలో యూపీలో 14సీట్లు పూర్వాంచల్ రీజియన్లో ఉన్నాయి. ఈ దశలో 967 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బరిలో పలువురు ప్రముఖులు
ఆరో దశలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, హర్యానా మాజీ సీఎం దీపేందర్ హూడా, కిరణ్ ఖేర్ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం భద్రత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా గత ఐదు దశల్లో హింస చెలరేగిన బెంగాల్పై ప్రత్యేక దృష్టి పెట్టింది.