ముగిసిన మూడో విడత ప్రచారం .. ఏప్రిల్ 23న పోలింగ్, బరిలో పలువురు ప్రముఖులు
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఈ దఫాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు అదృష్టాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
యూపీ నుంచే బీజేపీ పతనం!.. మోడీని సాగనంపడం ఖాయమని మాయా జోస్యం!
116 నియోజకవర్గాల్లో పోలింగ్
మూడో విడత పోలింగ్ జరగనున్న 116 నియోజకవర్గాల్లో గుజరాత్లో 26, కేరళలో 20, మహారాష్ట్ర 14, కర్నాటక 14, యూపీ 10, ఛత్తీస్గఢ్ 7, ఒడిశా 6, బీహార్లో 7, బెంగాల్లో 5, అసోంలో 4, గోవాలో రెండు స్థానాలున్నాయి. జమ్మూకాశ్మీర్, దాదా నగర్ హవేలీ, త్రిపుర, డామన్ డయ్యూల్లో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. రెండో దశలో వాయిదా వేసిన త్రిపుర ఈస్ట్, తమిళనాడులోని వేలూరు నియోజకవర్గానికి 3వ దశలో పోలింగ్ జరగనుంది.
బరిలో పలువురు ప్రముఖులు
కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్తో పాటు పార్టీ సీనియర్ నేత శశిథరూర్ బరిలో ఉన్న తిరువనంతపురంలోనూ ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బరిలో ఉన్న గాంధీనగర్, వరుణ్ గాంధీ పోటీ చేస్తున్న ఫిలిబిత్ నియోజకవర్గంలో ఈ దశ ఎన్నిక జరుగుతుంది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసే మెయిన్పురి, రాంపూర్ నుంచి బరిలో దిగిన జయప్రద మూడో విడతలో అదృష్టం పరీక్షించుకోనున్నారు.
అనంత్నాగ్లో బ్యాలెట్ విధానం
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ నియోజకవర్గంలోని ఓ జిల్లాలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఒడిశాలో ఆరు లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడో దశలో పోలింగ్ జరగనుంది. ఆరు లోక్సభ స్థానాల్లో 61 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా... అసెంబ్లీ ఎన్నికల్లో 356 మంది పోటీ చేస్తున్నారు.