ష్ ... గప్ చుప్.. ముగిసిన తుది విడత ప్రచారం..! ఎక్కడికక్కడ మూగబోయిన మైకులు..!!
దిల్లీ: ఓ ప్రహసనం ముగిసింది. 2019 సాధారణ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిత స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా నిక్షిప్తమైంది. ఏడో విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 19న లోక్సభ తుది విడత ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏడో విడతలో 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 19న పోలింగ్ ముగిశాక, సాయంత్రం 6 గంటల అనంతరం ఎగ్జిట్పోల్స్ వెలువడనున్నాయి. ఈ నెల 23న లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్లో కీలకమైన 13 స్థానాలకు చివరి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 167 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తోన్న వారణాసి నియోజకవర్గం కూడా చివరి విడత ఎన్నికల బరిలోనే ఉంది. దీంతోపాటు పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు, పశ్చిమ బంగాల్లోని 9 స్థానాలకు, బిహార్లో 8 పార్లమెంటు స్థానాలకు, మధ్యప్రదేశ్లోని 8 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లో 4, ఝార్ఖండ్లో 3, ఛండీగఢ్లో ఒక స్థానానికి చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, శత్రుఘ్నసిన్హా, హర్ సిమ్రత్ కౌర్ తదితరులు ఈ విడతలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.