కరోనా : మనిషి సౌండ్తోనూ వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చా.. కేంబ్రిడ్జి సంచలన పరిశోధన..
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. వైరస్ సోకిన పేషెంట్లను త్వరగా గుర్తించగలిగితే.. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే 130 కోట్ల జనాభా కలిగిన భారత్ లాంటి దేశాల్లో వైద్య పరీక్షలు ప్రభుత్వానికి సవాల్గా మారాయి. సగటున ఒక మిలియన్ జనాభాకు ఇప్పటివరకు కేవలం 100 వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహించారు. అభివృద్ది అమెరికా,స్పెయిన్,ఇటలీ,జర్మనీ వంటి దేశాల్లో సగటున ఒక మిలియన్ జనాభాకు 6వేల నుంచి 10వేల పైచిలుకు టెస్టులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కేసులను త్వరగా గుర్తించడంలో.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఆ దేశాలు విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాలను గుర్తించడం కోసం కొత్త రకం టెక్నాలజీ తెర పైకి వస్తోంది.
కేంబ్రిడ్జి పరిశోధనలు...
కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు ఓ కొత్త రకం మొబైల్ యాప్ను రూపొందించారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. మనిషి మాట్లాడేటప్పుడు,శ్వాస తీసుకునేటప్పుడు,దగ్గేటప్పుడు వచ్చే సౌండ్ ద్వారా అతనికి కోవిడ్ 19 లక్షణాలు ఉన్నాయో లేదో పసిగట్టగలుగుతుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. కరోనా వైద్య పరీక్షలకు సంబంధించిన సవాల్ను అధిగమించినట్టే. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ను అభివృద్ది చేయడం ద్వారా ఇది కోవిడ్ 19 పేషెంట్లను గుర్తించగలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
సౌండ్ ఆధారంగా..
ఈ మొబైల్ యాప్కి సంబంధించి యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్(ERC) ఒక ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేసింది. కోవిడ్ 19 శ్వాసకోశ సమస్యకు సంబంధించినది కావడంతో.. వైరస్ సోకినవారిలో శ్వాస తీసుకునేటప్పుడు,దగ్గేటప్పుడు వచ్చే సౌండ్ భిన్నంగా ఉంటుందని పేర్కొంది. ఈ యాప్ యూజర్స్ హెల్త్ డేటాను,మెడికల్ హిస్టరీని సేకరిస్తుందని తెలిపింది. అలాగే వారి శ్వాస,దగ్గుకు సంబంధించిన సౌండ్స్ సాంపిల్స్ను రికార్డు చేస్తుందని తెలిపింది. సదరు యూజర్ కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నాడా లేదా అన్న సమాచారాన్ని కూడా సేకరిస్తుందని పేర్కొంది.అలా సేకరించిన డేటా మొత్తాన్ని ఇతర పరిశోధకులకు పంపిస్తారని.. దాన్ని బట్టి వ్యాధి తీవ్రతను అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.
ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ కోసం ప్రయత్నాలు
కరోనాపై పోరులో ఓవైపు మానవ ప్రయత్నం జరుగుతూనే... మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే కోవిడ్-19 నెట్ అనే వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు కరోనా డేటాను సేకరించి ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. దీని ద్వారా ఇప్పటివరకు 2800 మంది కరోనా పేషెంట్ల నుంచి దాదాపు 6వేల ఛాతి ఎక్స్రేలు సేకరించి.. వారి ఊపిరితిత్తులను పరిశీలిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చి వైరస్ జన్యు క్రమాన్ని,దాని మార్పులను గుర్తించగలిగితే పెద్ద విజయం సాధించినట్టేనని చెప్పాలి.
Recommended Video
భారత్లోనూ ఓ యాప్..
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో బాగంగా భారత్లోనూ ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పాజిటివ్ పేషెంట్లను గుర్తించడంతో పాటు.. పాజిటివ్ పేషెంట్లకు దూరంగా ఉండేలా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఈ యాప్ పనిచేస్తుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో మొబైల్ నంబర్,పేరు,వయసు,జెండర్ ఇతరత్రా వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫోన్ బ్లూ టూత్,లొకేషన్ నిరంతరం ఆన్ మోడ్లో ఉంచాలి. తద్వారా కోవిడ్ 19 పేషెంట్ ఎవరైనా మీ సమీపంలో ఉన్నట్టయితే యాప్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే మీలో ఏవైనా కరోనా లక్షణాలు కనిపించినా.. ఈ యాప్ ద్వారా రిపోర్ట్ చేసి వైద్య సదుపాయం పొందవచ్చు.