తీర్పుపై పీపీ తీవ్ర వ్యాఖ్య: జయకు ఖుష్బూ నిలదీత, ఎమ్మెల్యే శిరోముండనం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో హైకోర్టు తీర్పు పైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య ఘాటుగా స్పందించారు. ఈ కేసులో కోర్టు సరైన రీతిలో వ్యవహరించలేదని, తమకు వాదించే అవకాశమే కల్పించలేదని, జయ అప్పీల్పై అభ్యంతరాల దాఖలుకు ఒక్కరోజే గడువిచ్చారన్నారు.
కర్ణాటక ప్రభుత్వానికి గానీ, అది నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తనకుగానీ మౌఖికంగా వాదించే అవకాశాన్ని కోర్టు కల్పించలేదన్నారు. దీంతో తమ వాదనలతో కోర్టును ఒప్పించే వీలులేకపోయిందన్నారు. ఇది ఆందోళనకర దురభిప్రాయానికి తావిస్తోందన్నారు.
జయ తరఫు న్యాయవాదులు వాదించేటప్పుడు కర్ణాటక ప్రభుత్వం తరఫున అభ్యంతరాలు చెప్పేవారు ఎవరూ లేరని గుర్తు చేశారు. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వమే సమగ్ర విచారణ ఏజెన్సీ అని సుప్రీం కోర్టు చెప్పినా, హైకోర్టులో ఆ మేరకు తమకు అవకాశం దక్కలేదన్నారు.
జయ అక్రమాస్తుల కేసు విచారణ 18 ఏళ్లపాటు సరైన దారిలోనే సాగిందన్నారు. ఎంతో కష్టపడి ప్రతి ఆరోపణకూ తగిన ఆధారాన్ని న్యాయస్థానానికి సమర్పించామన్నారు. అన్నీ పరిశీలించిన ప్రత్యేక కోర్టు దోషులుగా ప్రకటించిందన్నారు.
ప్రమాణ స్వీకారం 17న అనుకున్నా...
జయలలిత 17వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయవచ్చునని తొలుత భావించారు. అయితే, 13 లేదా 14 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయవచ్చునని తెలుస్తోంది. నేడో రేపో పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జయలలితను నేతగా ఎన్నుకోనున్నారు.
జయలలిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ఆరు నెలల సమయం ఉంది. ఆమె కోసం ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఆమె మళ్లీ శ్రీరంగపురం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. అమ్మ ఆదేశించగానే సీఎం పదవి వదులుకునేందుకు ప్రస్తుత సీఎం పన్నీరు సెల్వం సిద్ధంగా ఉన్నారు.
గుండు చేయించుకున్న ఎమ్మెల్యే
జయలలితను కోర్టు నిర్దోషిగా తేల్చడంపై సంతోషం వ్యక్తం చేస్తూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓంశక్తి సేగర్ గుండు చేయించుకున్నారు. కేసు నుండి జయలలితకు విముక్తి కలిగితే శిరోముండనం చేయించుకుంటానని దేవుడికి మొక్కుకున్నానని, అది నెరవేరడంతో శిరోముండనం చేయించుకున్నానని చెప్పారు.
తప్పు చేయలేదనే ధైర్యంతో నిద్రపోగలరా: జయకు ఖుష్బూ
జయలలిత తాను ఎలాంటి తప్పు చేయలేదనే ధైర్యంతో నిద్రపోగలరా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ మంగళవారం ప్రశ్నించారు.