జయలలిత కుమార్తె: అమృత వెనుక మన్నార్ గుడి మాఫియా, జైల్లో శశికళ స్కెచ్ ?
బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను అంటూ మీడియా, కోర్టు ముందుకు వచ్చిన బెంగళూరు నివాసి అమృత (37) వెనుక పెద్ద తతంగం జరుగుతోందని తెలిసింది. ఈ విషయంపై తమిళనాడుతో సహ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమృత వెనుక మన్నార్ గుడి మాఫియా ఉందని సమాచారం.
శశికళ ధైర్యంతోనే ?
జయలలిత కుమార్తెను తానేనని, అవసరమైతే డీఎన్ఏ పరీక్షలకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని బెంగళూరుకు చెందిన అమృత గతంలో రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాసి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శశికళ ఇచ్చిన ధైర్యంతోనే అమృత బయట ప్రపంచంలోకి వచ్చారని తెలిసింది.
శశికళ ప్లాన్ ఎలా వేశారు ?
బెంగళూరుకు చెందిన అమృతను బయట ప్రపంచంలోకి తీసుకు వచ్చింది మాత్రం అన్నాడీఎంకే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరణకు గురైన వీకే శశికళ నటరాజన్ అని వెలుగు చూసింది. జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి దీపా, దీపక్ ప్రయత్నాలు చేస్తుంటే శశికళ ఇప్పుడు కొత్తగా అమృతను తెరమీదకు తీసుకు వచ్చారని తెలిసింది.
ఎవరు ఈ రంజని ?
జయలలిత తల్లి సంధ్యకు రంజని సమీప బంధువు. గతంలో రంజని అనేకసార్లు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని జయలలితకు చెందిన వేదనిలయంకు వెళ్లి వచ్చారు. మూడు నెలల క్రితం రంజని స్వయంగా అమృతను తెరమీదకు తీసుకు వచ్చి జయలలిత బంధువులకు పరిచయం చేశారు.
జైల్లో శశికళతో రంజని భేటీ !
మూడు నెలల క్రితం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ నటరాజన్ తో రంజని భేటీ అయ్యారని ఓ తమిళ దినపత్రిక వివరాలు వెల్లడించింది. శశికళ, రంజని భేటీ తరువాతే అమృత తాను జయలలిత కుమార్తె అంటూ ప్రచారం చేసింది. మన్నార్ గుడి మాఫియా సహకారంతోనే రంజని జైల్లో శశికళను కలిశారని తెలిసింది.
రంజని సహాయం ?
జయలలిత ఆడబిడ్డకు జన్మనిచ్చిన సమయంలో రంజని ఆమె పక్కనే తొడుగా ఉన్నారని వీరి సమీప బంధువు లలిత (బెంగళూరు) ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. అయితే జయలలిత కుమార్తె అమృత అనే విషయం తాను కచ్చితంగా చెప్పలేనని లలిత అన్నారు.
రంజని, లలిత సంతకాలు
జయలలిత కుమార్తె తానే అంటూ అమృత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో ఆ విషయాన్ని దృవీకరిస్తూ రంజని, లలిత సంతకాలు చేశారని వెలుగు చూసింది. జయలలితకు కుమార్తె ఉన్న విషయం రంజని, లలితకు తెలిసినందుకే వారు సంతకాలు చేసి ఉంటారని వాదనలు వినిపిస్తున్నాయి.
శశికళకు మొత్తం తెలుసు
జయలలితకు సంబంధించిన అన్ని రహస్యాలు దాదాపుగా శశికళ నటరాజన్ కు తెలుసని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు అంటున్నాయి. జయలలితకు కుమార్తె ఉన్న విషయం కచ్చితంగా తెలిసిన శశికళ ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ, జయ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి అమృతను తెరమీదకు తెచ్చారని తెలిసింది.
శశికళ పగ పెంచుకున్నారు ?
శశికళ నటరాజన్ ఇప్పుడెందుకు అమృతను బయటి ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారనే విషయంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జయలలిత ఆస్తుల కోసమా ? లేక తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి చెడ్డపేరు తీసుకురావడానికా ? అనే విషయం అర్దం కాక తమిళనాడు ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అసలు శశికళ ప్లాన్ ఏమిటీ ? అంటూ ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు.