ఆసియన్ నాటోగా 'క్వాడ్' అవతరించబోతుందా... విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమంటున్నారు...
భారత్,అమెరికా,జపాన్,ఆస్ట్రేలియా... ప్రపంచం మొత్తం ఇప్పుడీ నాలుగు దేశాల 'క్వాడ్' కలయికను ఆసక్తిగా గమనిస్తోంది. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) పేరిట ఈ నాలుగు దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమి 'ఆసియా నాటో'గా అవతరించబోతుందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. శుక్రవారం(అక్టోబర్ 23) పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా(PAFI) ఆన్లైన్ ఇంటరాక్షన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీనిపై స్పందించారు.
'మెరీటైమ్ సెక్యూరిటీ, కౌంటర్-టెర్రరిజం,మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించుకోవడం,విపత్తు ఉపశమన చర్యలు వంటి అంశాలపై పరస్పర సహాయ సహకారాల కోసం నాలుగు దేశాలు కలిసి క్వాడ్గా ఏర్పడ్డాయి.' అని జైశంకర్ స్పష్టం చేశారు. ఆన్లైన్ ఇంటరాక్షన్ సందర్భంగా... 'క్వాడ్' కూటమి ఆసియా నాటోగా అవతరించబోతుందా అన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానం వెలిబుచ్చారు.
ఒకప్పటి ప్రచ్చన్న యుద్ద దశలో కేవలం రెండు దేశాల ఆధిపత్య శిబిరాల మధ్య ప్రపంచం విడిపోయిన దశ నుంచి నేడు సైనిక,సాంస్కృతిక,ఆర్థిక తదితర రంగాల్లో పలు దేశాలు సమాన హక్కులతో కూటమిగా ఏర్పడే వరకు ఈ ప్రపంచ ప్రయాణం సాగుతూ వస్తోందన్నారు. పాశ్చాత్య దేశాల సమిష్టితత్వం తగ్గిందని... అదే సమయంలో అమెరికా శక్తిలో మార్పు,చైనా ఎదుగుదలను ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు.
కాగా,రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి పరిణామాల్లో ప్రపంచమంతా యుఎస్ఎస్ఆర్ (రష్యా), అమెరికా శిబిరాలుగా విడిపోయింది. ఈ రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏర్పడింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యా, అమెరికా వర్గాలు అనేక సైనిక ఒప్పందాలు చేసుకొని, చాలా దేశాలను వారి కూటములలో చేర్చుకున్నారు. అలా ఏర్పడిన కూటముల్లో ఒకటే 'నాటో' కూటమి. ప్రస్తుతం భారత్,అమెరికా,జపాన్,ఆస్ట్రేలియా దేశాలు కూడా క్వాడ్ కూటమిగా ఏర్పడటంతో.. చైనాను ఎదుర్కొనే క్రమంలో ఈ కూటమి 'ఆసియా నాటో'గా అవతరిస్తోందా అన్న చర్చ జరుగుతోంది.
Recommended Video
ఈ నాలుగు దేశాలు కలిసి వచ్చే నెలలో మలబార్ తీరంలో సంయుక్త సైనిక విన్యాసాలు కూడా నిర్వహించనున్నాయి. ఓవైపు సరిహద్దులో భారత్తో కయ్యం.. మరోవైపు ఇండో-పసిఫిక్ సముద్ర జలాలపై ఆధిపత్యం దిశగా చైనా ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో ఈ సైనిక విన్యాసాలు జరగబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకరకంగా చైనాకు ఇది పరోక్ష హెచ్చరిక లాంటిదే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.