రజనీ బ్రేక్ చేస్తారా? బ్రాహ్మణ వ్యతిరేకత.. భాష ప్లస్ ఆత్మగౌరవమే తమిళ పాలిటిక్స్లో కీలకం
చెన్నై: తమిళనాట ఎఐఎడీఎంకే నాయకురాలు జే జయలలిత మరణం, క్రియాశీల రాజకీయాలకు డీఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి దూరమైన నేపథ్యంలో సూపర్స్టార్ రజనీకాంత్ కీలక దశలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు రాజకీయ వ్యవహారాల్లో తొలి నుంచి ప్రత్యేకత ఉన్నదంటే అతిశయోక్తి కాదు. బ్రాహ్మణేతర సామాజిక వర్గాల నేతలు సరిగ్గా దశాబ్ద కాలం క్రితం 1916 నవంబర్లో సమావేశమై దక్షిణ భారత విముక్తి సమాఖ్య (సిల్ఫ్) తదుపరి జస్టిస్ పార్టీగా అవతరించింది.
Recommended Video
బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా, కుల వివక్షపై పోరాటం దిశగా ఏర్పాటైన 'సిల్ఫ్' తదుపరి జస్టిస్ పార్టీగా అవతరించింది. జస్టిస్ పార్టీలో సంఘ సంస్కర్త 'ఇ.వి. రామస్వామి (పెరియార్)' తదితరులు ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అదే తర్వాత ద్రవిడ కజగంగా మారింది. ప్రస్తుత డీఎంకే, అన్నాడీఎంకే వంటి రాజకీయ పార్టీలకు వేదికగా మారింది.
1967లో ద్రవిడ కజగం (డీఎంకే) ఏర్పాటుకు ఇలా కీలకం
సంఘసంస్కర్త ఈవీ రామస్వామి ప్రారంభించిన ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి మతం, ఆధ్యాత్మికతను తీవ్రంగా వ్యతిరేకించింది. భగవద్గీత, వర్ణవ్యవస్థ, ఆర్య - ద్రవిడ సిద్ధాంతం, తమిళ సంస్కృతి వంటి అంశాలపై రామస్వామి తరచూ మాట్లాడేవారు. ఆ తర్వాత హేతువాది సీఎన్ అన్నాదురై దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. అనంతరం తమిళనాడులో దేవుడిపై వ్యతిరేక వైఖరి పెరుగుతూ పోయింది. ఇలాంటి ఆలోచనలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా 1967లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధికారంలోకి వచ్చింది.
రహస్యంగా ఎంజీఆర్ దేవాలయాల సందర్శన ఇలా
ఆ తర్వాత 60 ఏళ్లుగా రాజకీయాల్లో ఆధ్మాత్మికత గురించి ఎవరూ మాట్లాడే ధైర్యం చేయలేదు సరికదా.. తమ సిద్ధాంతాలను వెల్లడించే ప్రయత్నించలేదు. దేవుణ్ణి నమ్మే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ దేవాలయ సందర్శనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. జయలలిత తన నమ్మకాలను బహిరంగంగా ప్రదర్శించారు. దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. దేవుని సాక్షిగానే ప్రమాణస్వీకారం చేసేవారు. తమిళ రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతం పాత్రను మాత్రం ఎన్నడూ విస్మరించలేదు. 2003లో మతప్రచార వ్యతిరేక బిల్లును తీసుకొచ్చినందుకు తర్వాతి పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఒక్కసీటు కూడా దక్కలేదు. దీంతో తర్వాత ఎప్పుడూ జయ అలాంటి ప్రయోగాలు చేయలేదు.
రజనీ ప్లస్ కమల్ మొత్తం వ్యవస్థనే సమూలంగా మార్చేస్తారా?
పెరియార్ తరహాలోనే అటువంటి తమిళనాట రాజకీయ ఉద్యమాలు కొలువు తీరాయి. దక్షిణ రాష్ట్రం తమిళనాడులో రజనీకాంత్ రంగ ప్రవేశంతో ద్రవిడ ఉద్యమం, ఆత్మగౌరవ నినాదం వంటి అంశాలు భగవద్గీత ప్రస్తావన వంటి పరస్పర విరుద్ధ అంశాలు ముందుకు వస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తన నినాదాలతో రజనీకాంత్ రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చేస్తారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. రజనీకాంత్తోపాటు ఆయన సహ నటుడు కమల్ హసన్ కూడా త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు.
రజనీ గురువుగా రాఘవేంద్ర స్వామి
ద్రవిడ సిద్ధాంత వ్యతిరేకులు తమిళప్రజల్లోని భావనలను తొలగించేందుకు చాలాసార్లు విఫలయత్నాలు చేశారు. చాలాకాలం తర్వాత రజనీకాంత్ బహిరంగంగానే భగవద్గీత శ్లోకాలను ప్రస్తావించటం ఆశ్చర్యం కలిగించింది. రజనీకాంత్కు ఆధ్యాత్మికతే సర్వస్వం. తమిళనాడులోని హిందుత్వ మూలాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని, కులం, మతం కంటే ఆధ్యాత్మికతే ముఖ్యమని రజనీ భావిస్తారు. కుల వ్యవస్థను వ్యతిరేకించిన రాఘవేంద్ర స్వామిని రజనీకాంత్ తన గురువుగా భావిస్తారు. హిమాలయాలను తరచూ సందర్శిస్తూ యోగి జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ఏళ్ల తరబడి తమిళనాట రాజకీయాలకు, సినిమాలకు మధ్య గల అవినాభావ సంబంధం మరికొంత కాలం విస్తరణ దిశగా సాగుతుంది.
ఎంజీఆర్ తరహా చరిత్ర నెలకొల్పడం అసాధ్యం ఇలా..
ఇంతకుముందు సీనియర్ సినీ నటుల మాదిరిగా రాజకీయాల్లో సూపర్స్టార్ రజనీకాంత్తోపాటు కమల్ హసన్ విజయం సాధిస్తారా? అన్న సందేహాలు ఉన్నాయి. ఎంజీఆర్ మాదిరిగా రజనీకాంత్ గానీ, కమలహసన్ గానీ ‘తమిళ నాడు రాజకీయాల్లో' చరిత్ర నెలకొల్పడం అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో తెర వెనుక నుంచి తమిళనాట అధికార రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని బీజేపీ తల పోస్తున్నదని విమర్శలు వినిపించాయి.
2019లో పొత్తులపై బీజేపీ నేత సౌందర్య రాజన్ ఇలా
రెండు రోజుల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేసిన ‘తలైవర్' భగవద్గీత శ్లోకాలు చెప్పడంతో రజనీకాంత్ బీజేపీకి తనకు తాను అసోసియేట్ అన్న చర్చ తమిళనాడుతోపాటు జాతీయ రాజకీయాల్లో సాగుతోంది. ఈ వదంతులకు అనుగుణంగానే 2019 లోక్ సభ ఎన్నికల్లో సినీ నటుడు రజనీకాంత్ స్థాపించిన రాజకీయ పార్టీ.. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చునని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళ్ సాయి సౌందర్యరాజన్ పేర్కొనడం బలాన్ని చేకూరుస్తున్నది.
మోదీకి దగ్గరగా రజనీకాంత్ రాజకీయ నినాదాలు
తమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేసిన రజనీకాంత్.. 60 ఏళ్లకుపైగా కొనసాగుతున్న, తిష్ఠ వేసిన ద్రవిడ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ ప్రబోధించిన ‘ఆధ్యాత్మిక రాజకీయాలు'.. ప్రధాని మోదీ విధానానికి దగ్గరగా ఉన్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సిద్ధాంత వేత్త ఎస్ గురుస్వామి ట్వీట్ చేయడం గమనార్హం. తాను స్థాపించే రాజకీయ పార్టీ.. కుల, మతాలకతీతంగా ఉంటుందని, ఆధ్యాత్మకతతో కూడిన రాజకీయాలు నెరుపుతామని రజనీ పేర్కొనడం ఆసక్తికర పరిణామం. రజనీకాంత్.. తమిళనాట మతతత్వ రాజకీయాలకు ద్వారాలు తెరిచేందుకు పునాది కల్పిస్తున్నారని విద్యుథలాయి చిరుథాయిగల్ కచ్చి (వీసీకే) నాయకుడు డీ రవి కుమార్ ఆరోపించారు.
రజనీకి అనుకూలంగా తమిళ సామాజిక పరిస్థితులు
రజనీ రాజకీయ ప్రవేశం తమిళ రాజకీయ సిద్ధాంతాల్లో మార్పులు తెచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనికితోడు 1967 నాటి భాష, కులం ఆధారంగా నడిచిన ద్రవిడ రాజకీయాలు ప్రస్తుతం మచ్చుకైనా కనిపించటం లేదు. దీంతో రజనీకి పరిస్థితులు కలిసొస్తాయని.. ఆరెస్సెస్ చేయలేని పనిని ఈయన చేసే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఏడాది క్రితం జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ రంగంలో బలం పుంజుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ దీనిపై తమిళులు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా స్వరం వినిపిస్తున్నారు. జాతీయ పార్టీ ఆటోక్రాటిక్ వైఖరిని తమిళులు ఒక ‘విలన్'గా చూస్తున్నారు. సామాజిక ఉద్యమం ప్రాతిపదికన తమిళనాడు రాజకీయాలు సాగుతున్నాయి.
తమిళ రాజకీయాల్లో శివాజీ గణేశన్ ఇలా విఫలం
ఆత్మగౌరవం, భాష ప్రాతిపదికన ద్రవిడ రాజకీయాలు జరుగుతున్నాయి. థియేటర్, సినిమా ఇప్పటికి కూడా తమిళులను సామాజికంగా భారీగా సమీకరించే ఆయుధాలుగా ఉన్నాయి. కానీ తమిళనాడులో కొందరు ప్రజాదరణ పొందిన రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వారిలో శివాజీ గణేశన్ వంటి వారు రాజకీయాల్లో ప్రవేశించిన వారు విఫలమయ్యారు. అపూర్వమైన ప్రజాభిమానం, ఆదరణ గల సినీ నటుడు అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్).. పేదలు, అట్టడుగు వర్గాల వారిని ఆకట్టుకోగలిగారు. వారి విశ్వాసాన్ని చూరగొన్నారు. నిరంతరం ఆయన కల్పించుకున్న వ్యక్తిగత ఇమేజ్కి తోడు ద్రవిడియన్ ఉద్యమం సాధారణ తమిళుల మనస్సుల్లోకి దూసుకెళ్లింది.