రైతు నిరసనలపై సుప్రీం సీరియస్-రోడ్లపై వెళ్లేవారిని అడ్డుకుంటారా ? కేంద్రానికీ సూచన
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కొన్ని నెలలుగా రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు. అయితే వీరిని పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే విచిత్రంగా రైతులు తమ నిరసనలతో తమను రోడ్డుపై వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారంటూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నోయిడా నుంచి 20 నిమిషాల్లో ఢిల్లీకి వెళ్లాల్సిన తనకు ఈ ఆందోళనల కారణంగా 2 గంటలు పట్టిందంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది.
రైతు నిరసనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా ప్రజలను రోడ్లపై స్వేచ్ఛగా సంచరించే హక్కును హరించేలా నిరసనలు చేపట్టడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారో చెప్పాలని రైతు నేతలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే సందర్భంగా ఇతరులు ఎందుకు ఇబ్బందులు పడాలని అడిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టు మార్చి 26న ఇచ్చిన ఆదేశాల్లో ఢిల్లీలో రైతు ఆందోళన సందర్భంగా రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులపై స్పందించిన సొలిసిటర్ జనర్ తుషార్ మెహతా కరోనా వైరస్ విజృంభణ కారణంగా రైతు ఆందోళనల కంటే కరోనాపైనే పోలీసులు దృష్టిపెట్టాల్సి వస్తోందన్నారు. అయితే దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు... కొందరి ఆందోళన కారణంగా ఎక్కువ మంది ప్రభావితం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.. అదే సమయంలో కరోనా సమయంలో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా చూడాల్సిన బాద్యత కూడా మీపై ఉందని కేంద్రానికి తెలిపింది.