ఈసారి యుద్ధం గతంలో చేసినట్లు ఉండదు: కీలక విషయాలు చెప్పిన ఆర్మీ చీఫ్ రావత్
న్యూఢిల్లీ: ఈసారి యుద్ధం వస్తే గతంలో పోరాడినట్లు ఉండదని, ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మంగళవారం అన్నారు. సైనిక దళాల ఆధునికీకరణ కోసం చేపట్టబోయే చర్యలను వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సైనిక దళాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన విశేషాలను ఆయన తెలిపారు. ముఖ్యంగా నాలుగు అధ్యయనాల ఆధారంగా ఆర్మీని ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆధునికీకరణ పూర్తయితే భారత సైన్యం మరింత శక్తిమంతమవుతుందని చెప్పారు.
మార్పు ఒక్కరోజులో సాధ్యం కాదు, కానీ తథ్యం
ఇప్పటికే పూర్తయిన నాలుగు అధ్యయనాల్లోని సిఫార్సులను అమలు చేస్తే ఆర్మీ సంఖ్య లక్ష వరకు తగ్గే అవకాశముందని, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో సైన్యం శక్తిమంతమవుతుందని చెప్పారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ బ్రిగేడ్లను ఏర్పాటు చేస్తామని, అదే జరిగితే యుద్ధం సమయంలో ఆర్మీని వేగంగా మోహరించవచ్చునని చెప్పారు. మారుతున్న యద్ధ తంత్రాలకు అనుగుణంగా సిద్ధం చేస్తామని చెప్పారు. ఎప్పటికి అప్పుడు కొత్త టెక్నాలజీని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే ఈ మార్పులు ఒక్క రోజులో సాధ్యం కావని, కానీ మార్పు మాత్రం తథ్యమన్నారు.
మోడీ వద్దకు నాలుగు అధ్యయనాలు, ఒకటి ఏడాదిలో ప్రారంభం
ఇప్పటికే నాలుగు అధ్యయనాలు ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వచ్చాయని చెప్పారు. వీటిల్లో తొలుత ఆర్మీ ప్రధాన కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ అంశాన్ని అనుమతుల కోసం రక్షణ శాఖకు పంపిస్తామని, అనుమతులు రాగానే ఏడాదిలో పనులు మొదలవుతుయని చెప్పారు. మిగిలిన మూడు అధ్యయనాలను 2019 మధ్యలో అనుమతుల కోసం పంపిస్తామని చెప్పారు.
దళాల సంఖ్యను లక్ష తగ్గిస్తాం
కల్నల్ ర్యాంకు అధికారులను నేరుగా మేజర్ జనరల్స్గా పదోన్నతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రావత్ తెలిపారు. వచ్చే అయిదేళ్లలో దళాల సంఖ్యను లక్ష వరకు తగ్గించనున్నట్లు చెప్పారు. వీరిలో కొంతమంది సైబర్, సమాచార, మానసిక యుద్ధ తంత్ర విభాగాలకు వెళ్తారని తెలిపారు. ఇప్పుడు ఓ సైనికుడి పైన రూ.8 లక్షల వరకు వెచ్చిస్తున్నామని, ఆఫీసర్ పైన రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నామని, అధికారులు తగ్గాక మిగిలిన నిధులను ఆధునికీకరణ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు.
ప్రధాన కార్యాలయాల తరలింపు
ప్రధాన కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ చాలా కీలకమని రావత్ తెలిపారు. అప్పుడే దళాలకు సరైన ఆయుధాలు అందుతాయన్నారు. కొన్ని కార్యాలయాలు తరలిపోవచ్చునని చెప్పారు. రాష్ట్రీయ రైఫిల్స్ ప్రధాన కార్యాలయం జమ్ము కాశ్మీర్లోని ఉధంపూర్ వెళ్లే అవకాశముందని చెప్పారు.