రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయలేం..సుప్రీంకు చెప్పిన కేంద్రం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితులను విడుదల చేసేది లేదని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. ఒక విదేశీ ఉగ్రవాద సంస్థ పక్కా ప్రణాళిక వేసి ఒక దేశ ప్రధానిని హతమార్చడం ఎంత మాత్రం సహించలేమని... శిక్ష అనుభవించాల్సిందేనని కేంద్రం తెలిపింది. గత 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నిందితులకు విడుదల ఉండబోదని ఏప్రిల్ 18న కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి. అదే విషయాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి కేంద్రం వివరించింది.
ఫిబ్రవరి 19, 2014న నిందితులకు విముక్తి కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు తమిళనాడు ప్రభుత్వం లేఖ రాసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులుగా శిక్ష పొందుతున్న మురుగన్, శంతన్, పెరారీవాలన్, నళిని, రాబర్ట్ పీయస్, జయకుమార్, రవిచంద్రన్లను విడుదల చేయాలంటూ మరోసారి 2016, మార్చి 2న కేంద్రానికి లేఖ రాసింది. అయితే దీనిపై స్పందించేందుకు కేంద్రం మూడునెలల్లోగా సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు జనవరిలో సూచించింది. ముందస్తు ప్రణాళికతో ఆనాటి ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీని హత్య చేయడం సహించరానిదని... అదే సమయంలో ఆనాడు దేశం చాలా నష్ట పోయిందని అడిషనల్ సాల్సిటర్ జనరల్ కేంద్రం తరపున తెలిపారు. అంతేకాదు నాడు ఈ ఘటనతో పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికలు కూడా వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన కోర్టుకు వివరించారు.
ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ కేసు తీవ్రతను పరిగణించి రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విముక్తి కల్పించలేమని తెలిపినట్లు ధర్మాసనానికి అడిషనల్ సాల్సిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అంతేకాదు హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు విదేశీయులు, ముగ్గురు భారతీయులను విడుదల చేస్తే అంతర్జాతీయంగా ఉన్న క్రిమినల్స్ దీన్ని అలుసుగా తీసుకుని ఏమైనా సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని ధర్మాసనానికి కేంద్రం వివరించింది. ఇప్పటికే ముగ్గురికి మరణ శిక్ష పడగా... సుప్రీం కోర్టు వారిని జీవితకాల శిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది.